నయా పొలిటికల్ జమానా

 


మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నాం
?


తెలంగాణ రాష్ట్రం లో భారతీయ జనతా పార్టీని, కొసకు వై యెస్సార్ టీపీ ని ఎందుకని ప్రోత్సహిస్తున్నారు.?ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే ఒక వ్యూహం లో ఇది భాగం కాదా? ఈ విషయాన్ని సాధారణ ప్రజానీకం అర్థం చేసుకునే రోజు దగ్గర్లోనే ఉందా?ఇవన్నీ అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత కఠిన వాస్తవాలు. కఠోర సత్యాలు.

ఓ నాలుగు నెల్ల క్రింద నా వాల్ మీద రాసుకున్నట్టుగానే తెలంగాణ లో బెంగాల్ మోడల్ ఇప్పుడు ఆచరణ దశలో ఉన్నది. ఆ మోడల్ ను అమలు చేసేందుకు బకరాల్లా ఉపయోగపడుతున్న వాళ్లలో కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు వీలయినన్ని పదవులను అనుభవించిన కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు.

బెంగాల్ మోడల్ ను ఇక్కడ ఆచరణలో పెట్టడానికి ఉపకరిస్తున్న వాళ్లలో ఇక్కడి అధికార పక్షం కీలక పాత్ర పోషిస్తున్నది. మధ్య మధ్య వస్తున్న ఉప ఎన్నికలు ఇక్కడ ప్రతిపక్ష ఓటును చీల్చడం లో అధికార పక్ష సహచరగణాలు ఏ మేరకు ఉపకరిస్తున్నాయో తులనాత్మకం గా పరిశీలించుకునే అవకాశాన్నిస్తున్నాయనిపిస్తాది.

నిజానికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక భావనలు వేళ్ళూనుకున్న సందర్భాల్లో గతంలో కాంగ్రెస్ లాంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాత్మక రాజకీయాలూ చేయలేదు. కానీ వై యెస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సారి ఆ ప్రయోగాన్ని ప్రజారాజ్యం అనే పార్టీని సృష్టించడం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ గా రంగం లోకి తెచ్చాడు. దాన్ని ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న ప్రశాంత్ కిశోర్ వివిధ రాష్ట్రాల్లో ఆచరణలోకి పెట్టి సఫలీకృతుడయ్యాడు.

ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహ ప్రక్రియని ఒకింత ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్ష ఓటును ఎలా నిట్టనిలువునా చీల్చవచ్చో వరుసగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సందర్భాలలో అమలు పరిచి చూపుతున్నాడు.

బెంగాల్లో కనీసం ఊసులోలేని భారతీయ జనతా పార్టీని ఒక పటిష్టమైన రాజకీయ పక్షం గా చూపుతూ అప్పటి వరకూ ప్రతిపక్షం లో ఉన్న కమ్యూనిస్టులను, కాంగ్రెస్ ని తుడిచిపెట్టుకు పోయేలా ఆయన వ్యూహాలను అమలు చేసాడు.
ఇప్పుడు ఆ వ్యూహం తెలంగాణ లో అమలవుతున్నది.

దానికి పైలట్ గా రెండు ఉపఎన్నికల్లోప్రధాన ప్రతిపక్షాన్ని వూసులో కనిపించకుండా చేసి బీజేపీని బెలూన్లా ఉబ్బేలా చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అధికార పక్ష అనుకూల ఓటుగా మలిచేందుకు ఈ వ్యూహాలు ఉపయోగపడుతున్నాయనేది వాస్తవం.
నిజానికి ఎన్నికలు జరిగినప్పుడు అధికార పక్ష వ్యతిరేకత ఉన్న అన్ని సందర్భాలలోనూ అధికార మార్పిడి జరుగుతుండేది.

ఇప్పుడు అందుకు భిన్నమైన వ్యూహాలను అమలుచేసే రీతిలో రాజకీయ వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణా లో కనీసం బలం లేని పార్టీల వార్తలను పత్రికలు, ఛానళ్ళు కూడా ప్రధాన వార్తలుగా చూపేందుకు ఇక్కడి వ్యూహాత్మక రాజకీయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అస్సలు అడుగిడని నియోజక వర్గాల్లో అధికార టీ ఆర్ ఎస్ అకస్మాత్తుగా దాడులకుపక్రమిస్తుంది.

వై ఎస్ ఆర్ టీపీ నాయకురాలు  షర్మిళ కు ఊహించని రీతిలో ప్రచారం ఇస్తూ కాంగ్రెస్ లాంటి ప్రధాన రాజకీయ పార్టీ కార్యక్రమాలను టోన్ డౌన్ చేయడం ఈ వ్యూహం లో భాగం. ఇక్కడ అసలు ప్రజల్లో చర్చలో లేని పార్టీలను ప్రధాన చర్చనీయాంశాలుగా చెబుతూ ప్రతిపక్షాన్ని పట్టించుకోకపోవడం కొత్త రాజకీయాల్లో భాగం.

ఈ వ్యూహం ఇలాగే అమలవుతే రానున్న రోజుల్లో ప్రజల్లో అధిక సంఖ్యాకులుగా ఉండే అధికార పక్ష వ్యతిరేక వోటర్లు చీలికలై మళ్ళీ ప్రభుత్వ పక్షమే గెలుస్తుందనేది ఒక విశ్లేషణ. ఇది నిజమయ్యే పరిస్థితి ఇప్పుడున్నది. నిజమే కావచ్చుకూడా...



పి.వి.కొండల్ రావు
సీనియర్ జర్నలిస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు