అత్యున్నత న్యామ స్థానం అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసింది 17 మాసాలే అయినా విలక్షణ తీర్పులతో న్యాయ వ్యవస్థపై గౌరవం పెరిగేలా తనదైన ముద్రను వేశారు తెలుగువారైన జస్టిస్ ఎన్ వి రమణ. సుప్రీం కోర్టు 48 వ ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్ విరమణ శుక్రవారం పదవి విరమణ చేశారు.
ఆయన పదవి విరమణ సందర్భంగా న్యా వాదులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన పని తీరుపై ప్రశంసలు కురిపించారు.
చీఫ్ జస్టిస్ పదవి విరమణ రోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. , దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ ఎన్వీ రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టులో జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ ఎన్ విరమణ ప్రసంగించారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని ప్రస్తావిస్తు తన ప్రసంగం ప్రారంబించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని అన్నారు.
విశ్వ పౌరులుగా సమష్టిగా ప్రగతిశీల ప్రపంచం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'నాలో ఊపిరి ఉన్నంతవరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతాను. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సూక్తిని నిత్యం గుర్తుంచుకుంటాను' అన్నారు.
అంతకుముందు ఆయన ప్రసంగిస్తూ.... కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడించారు. "12 ఏళ్ల వయసులో నేను తొలిసారి కరెంటును చూశాను. ఓ సాధారణ కుటుంబంలో ఉండే అన్ని కష్టాలు అనుభవించాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. 17 ఏళ్ల వయసులో విద్యార్థి సంఘం ప్రతినిధిగా వ్యవహరించాను. అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చాను.
సత్యమేవ జయతే అనేది నేను నమ్మే సిద్ధాంతం. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అనేక అవాంతరాలు ఎదురైనా మౌనంగా భరిస్తూ నిలబడ్డాను. నాతో పాటు నా కుటుంబం కూడా ఆవేదనకు గురైంది. కర్తవ్య నిర్వహణలో నా వంతు పాత్ర పోషించానని భావిస్తున్నా. నేను సాధించిన ప్రతి గెలుపులోనూ నా సహచర జడ్జిల భాగస్వామ్యం ఎనలేనిది. నా పదవీకాలంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం మర్చిపోలేను. సుప్రీంకోర్టులో సహకారం అందించిన సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
కేసుల పరిష్కారంలో కొత్త పంథా తీసుకువచ్చాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ మా వంతు కృషి చేశాం. సుప్రీం కొలీజియంతో కలిసి 255 మంది జడ్జిల నియామకానికి సిఫారసు చేశాం. ఇప్పటిదాకా 224 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది.
ఈ వృత్తిలో అనేక ఒడిదుడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలి. న్యాయవాద వృత్తి కత్తి మీద సాము లాంటిది. ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యం. నవతరం జడ్జిలపై గురుతర బాధ్యత ఉంది. తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్ ఇప్పటికే తన గొప్పతనం నిరూపించుకున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు" అంటూ తన వీడ్కోలు ప్రసంగం సాగించారు
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box