బంగారు తెలంగాణ కాదు..కాదు.. ఇక నుండి బంగారు భారత దేశం. మన కెసిఆర్ సారు ఇప్పుడు ప్రాంతీయ వాదం నుండి బయట పడి జాతీయ రాజకీయాల బాటపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. బంగారు భారత దేశం ఆయన నోట కొత్త నినాదం ఎత్తుకున్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు మయం అయిందా లేదా అనేది రాజకీయాల్లో అప్రస్తుతం. కెసిఆర్ డైరీలో ఆయితే తెలంగాణ బంగారు మయం అయినట్లే. ఇక ఇప్పుడు దేశం వంతు మొదలైంది.
దేశంలో అరాచకమైన, అన్యాయమైన పాలన సాగుతోందని నారాయణ్ ఖేడ్ సభలో కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఈ తరహా పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరముందని బంగారు భారత దేశాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేద్దాం అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. చాలాకాలంగా దేశంలో మూడో ఫ్రంట్ అదిగో ఇదిగో అన్న కెసిఆర్ ఈ మద్యకాలంలో బిజేపీకి వ్యతిరేకంగా ప్రధానంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలలో పావులు కదుపుతున్నారు. బిజెపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పని మహారాష్ట్ర నుండి మొదలు పెట్టారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లతో చర్చించారు. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలు చుట్టేయనున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాల సీఎంలు, అక్కడి రాజకీయ పార్టీలతో చర్చలు జరపనున్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box