కదిలిన సిఎం
దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు సీఎం కేసిఆర్ బుధవారం గాంధీ దవాఖానాను సందర్శించారు. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సిఎం కెసిఆర్ ఎట్టకేలకు కదిలారు. కరోనా భాదితులు చికిత్స పొందుతున్న గాంధీ ఆస్పత్రిని కేసీఆర్ బుధవారం సందర్శించారు. ఎలాంటి పిపిఇ కిట్లుధరించకుండానే కేవలం మూతికి మాస్కులు ధరించి సిఎం ఆసుపత్రిలో కలియ తిరిగారు. ఆయన వెంట ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో సీఎం కలియతిరిగారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ కరోనా భాదితులతో స్వయంగా మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెల్సుకున్నారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. పరిస్థితుల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను, సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
ఆసుపత్రిలో మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎట్లా వున్నదని అడిగారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సీఎం పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్ ను తయారు చేసే ఆక్సిజన్ ప్లాంట్ ను ఇటీవలే నెలకొల్పారు.
ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులు, జూనియర్ డాక్టర్లతో సీఎం మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం వున్నదన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box