ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ముఖ్యమంత్రి

రెండు వేల ఆపత్కాల సాయంతో పాటు 25 కెజీల బియ్యం


ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆందోళన నెర వేరింది. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయలను తక్షణం ఆదుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారి చేసారు. ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు  కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. 

శనివారం ఉదయం 11:30 గంటలకు బీఆర్కె భవన్ లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డిని పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్సులో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డిఈఓలు పౌరసరఫరాల శాఖ డిఎస్ ఓ లు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను  మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.

 కరోనా కారణంగా పాఠశాలలు మూత పడడంతో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తమ కుటుంబాలను పోషించుకునే దారి లేక అల్లాడి పోయారు. ఏడాదికి పైగా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో గడుపుతున్నారు. తమను ఆదుకోవాని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. 

నాగార్జున సాగర్ లో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరు చిన్నారులను వదిలి పెట్టి ఆ ఉపాధ్యాయుడి భార్య కూడ కెనాల్ లో పడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతగా అలమ టించి పోతున్నారో అద్దం పట్టాయి. కరోనా నియంత్రణలోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియదు. అప్పటి వరకు తమ భవిష్యత్ ఏం కానంటూ రోడ్డున పడ్డ ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  ప్రభుత్వం అంద చేసే సహాయం వారికి కొంత ఉపషమనం కలుగ చేయనుంది. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు