సిఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం ! నిజంగా అన్నాడా ?

 



ఓ అత్యున్నత మైనటు వంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పదవిలో ఉన్న వ్యక్తి  ఆ పదవి నా ఎడమ కాలి చెప్పుతో సమానం అని అనగలడా
అన్నాడని మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలా ? నిజంగా అన్నాడా లేదా ?!. ఆయన ఏమన్నా అందుకు ఆయన స్వంత పార్టి గులాబి శ్రేణులదే  ఫైనల్ 'బయానా' అవుతుంది.

అత్యంత రహస్యంగా తెలంగాణ భవన్ లో నాలుగు గోడల మద్య జరిగిన పార్టి కార్యవర్గం సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కీలక విషయాలపై మాట్లాడారని వార్తలు వచ్చాయి. ఇదంతా సమావేశంలో పాల్గొన్న గులాబి నేతల నుండి మీడియావారు అతి కష్టంపై సేకరించి వెలుగు లోకి తెచ్చిన విషయాలు. ఎందుకంటే సమావేశం లోకి మీడియాను అనుమతించ లేదు. సమావేశం అనంతరం  అయినా ఎవరూ మీడియాకు వివరించనూ లేదు. చీకట్లో జరిగినా, పాతాళంలో జరిగినా మీడియాకు ఎంతో కొంత ఉప్పు అందుతుంది.

సిఎం పదివి విషయంలో గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలపై సిఎం కెసిఆర్ చాలా అసహనంగా రియాక్ట్ అయ్యారు. అదిలోనే తెర దించితే మీడియాలో ఈ చర్చ  జరిగేది కాదు..ఈ సందర్భంగా  విపక్ష నేతల రచ్చ ఉండేది కాదు కదా. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ నోట తొలుతు కెటిఆర్ సిఎం అవబోతున్నాడని వెలువడిన పదం కాస్తా దావాణలమైంది. ఇంతగా రగులుతుంటే స్జేజీల మీదే గులాబి నేతలు పోటీలు పడి యువరాజును పొగుడు తుంటే బయటా లోపలా వారించ లేదు సరి కదా తమాషా చూస్తు వచ్చారు. కెటిఆర్  సిఎం కావాలనే చర్చ జరిగితే టిఆర్ఎస్ కు లాభమెంతో నష్ట మెంతో అవగాహన చేసుకోకుండా మెప్పు పొందడంలో వెనుక పడి పోతామని పొగడ్తలు అనుసరిస్తు వచ్చారు.

అందరూ నిలువెత్తు గజ మాలలకు, కట్ అవుట్లకు ఆర్డర్లు ఇచ్చుకుని సమావేశంలో యువ నేతకు అడ్వాన్సుగా కంగ్రాట్సు చెప్పి కూర్చుంటే తర్వాత చల్లగా కెసిఆర్ గాలి వార్తలపై నీళ్లు చల్లి నిప్పులు చెరగడం చూసి గులాబి శ్రేణుల గుండెలు గుభేలు మన లేదా ?. గజ మాలలు ఏమై పోనూ...కట్ అవుట్లు ఏం చేసుకోనూ..అనే రందిలో పడి పోయారు కదా.

ఇక ఇదంతా పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం..సిఎం కెసిఆర్ భావోద్వేగంతో మాట్లాడే తీరులో సెటైర్లతో కూడిన పదాలు దూకుతుంటాయి.  ఆయన వీరావేశంలో హై పిచ్ కు వెళ్ళినపుడు కర్రు తీసి వాత పెట్టేయను గలడు. నేలకోసి కొట్టేయనూ ఘనుడు. కాని వందలాది మంది పార్టి ముఖ్యుల ఎదుట కెసిఆర్ అన్నట్లుగా మీడియాలో వచ్చిన మాట  సిఎం పదవి నా ఎడమ కాలి చెప్పుతో సమానం అని ఆయన నోటి నుండి నిజంగానే వెలువడి ఉంటే ఆయనకు ఇది ఎంత మాత్రం తగినది కాదనే విమర్శలు వస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో సిఎం పదవికి ఉండే గౌరవం, హోదా అంతకన్నా దానికుండే రాజ్యాంగ  ప్రతిష్ట ఎంతో విలువైనది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత శాసనం ద్వారా ఎన్నుకోబడే  ఏ పదివి అయినా అత్యుత్తమమే. ప్రజాస్వామ్య  వ్యవస్థల్లో పదవులకు ఉండే సార్వభౌమాధికారం సర్వ శ్రేష్ట మైంది. ఆ పదవులను కించపరిచినా తక్కువగా చేసి మాట్లాడినా ఏ వ్యక్తి అయినా తప్పులో పడతారు. ఇప్పుడు కెసిఆర్ నిజంగా సిఎం పదవిని చెప్పుతో పోలిస్తే తప్పుల పడినట్లే అవుతుంది.

సుదీర్ఘ కాలంగా జరిగిన తెలంగాణ మహోజ్వల ఉద్యమంలో కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు తమ భుజాల కెత్తుకుని 14 ఏళ్ళు నిర్విరామంగా  జైత్రయాత్ర చేసారు. తెలంగాణ సాధించే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా ప్రాణ త్యాగాలతో వందలాది మంది ఉద్యమానికి హారతులై నిలిచారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కెసిఆర్ ది చిరస్మరణీయ మైన పాత్ర. సకల  తెలంగాణ ప్రజలు కెసి ఆర్ ను  గుండెలకు హత్తుకుని ఉద్యమ శిఖరాగ్ర భాగాన చేర్చేందుకు తమ శిరస్సులు వాల్చారు. అలాంటి వీర తెలంగాణ గడ్డపై తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా సిఎం కెసిఆర్ నోచుకోవడం మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజల అభీష్టం లేకుంటే ఆయనకు  సిఎం  కుర్చీ దక్కేదే కాదు.  ఉద్యమ సమంలో అనేకం బొంకినట్లు దళితున్నే సిఎం ను చేస్తానని ఆతర్వాత తానే సిఎం అయినా తెలంగాణ ప్రజలు స్వాగతించారే కాని కోపగించ లేదు. ఉద్యమ నేపద్యం కలిగి అపారమైన  ప్రజావిశ్వాసం కలిగిన  నాయకుడిగా కెసిఆర్ కు సిఎం కుర్చీ పెద్ద లెక్కలేనిదే కావచ్చు. కాని దానికి ఉన్న రాజ్యంగ పరమైన గౌరవ మర్యాదలు కాపాడాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధిగా శాసనం ద్వారా  ఎన్నికైన శాసన సభా పక్షం నేతగా కెసిఆర్ కు ఉంది. ప్రజల కోసం పదవులుతనకు లెక్కకాజని చెప్పడం వేరు. కాని చెప్పుతో సమానం అని చెప్పడం పెద్ద తప్పిదం అవుతుంది. ఆయన భావోద్వేగంతో అని ఉంటే తెలంగాణ ప్రజలను మాఫి కోరడంలో కూడ తప్పు లేదు. కాలు జారితే పడి పోయనట్లే నోరు జారితే చెడి పోతారు. ఇది ఆయన ఇమేజ్ కు ఓ డ్యామెజీయే కాగలదు.

 

కూన మహేందర్
జర్నలిస్టు
ప్రజాతంత్ర 09-02-2021

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు