ఎన్ కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి...పౌరహక్కుల సంఘం డిమాండ్

 




తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లపైహైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిిిమాండ్



తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మొదట్లో ప్రకటించినాడు. కానీ 2015 లో శృతి సాగర్ లతో మొదలైన ఎన్కౌంటర్ హత్యాకాండ నిన్నటి ములుగు లో జరిగిన ఇద్దరు యువకుల వరకు కొనసాగింది, కానీ 15 రోజుల క్రితం చర్ల లో జరిగిన ఎన్కౌంటర్లపై నిజ నిర్ధారణకు బయలుదేరిన మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందాన్ని ఒక దినం అంతా నిర్బంధించి నిజానిర్దారణ చేయకుండా బైండోవర్ చేసి విడిచి పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, గడ్చిరోలి,చత్తీస్గఢ్, ఏవోబీ ప్రాంతాలలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన హక్కుల సంఘాలు బాధ్యతగా నిజనిర్ధారణ నిర్వహించాయి, కానీ గత ఏడాది కాలంగా ఎన్కౌంటర్ నిజ నిర్ధారణ ల పై కూడా తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నది. అది ఏ స్థాయి అంటే వేరే రాష్ట్ర పోలీసులచే అరెస్టు చేసి క్రూర నిర్బంధ చట్టాలతో నెలల తరబడి అక్రమంగా నిర్బంధించిన కుట్రపూరిత అప్రజాస్వామిక చర్యల్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చూసి ఉన్నారు.
ఎన్కౌంటర్లు లేకపోతే నిజంగానే నిజనిర్ధారణ ల అవసరం లేదని అనుకోవచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మించిన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వారి బంధువులు తమ వారిని పట్టుకొని ఎన్కౌంటర్ల పేరున చంపుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరము ఉంది ప్రజాస్వామిక దేశంలో ప్రభుత్వ పనితీరు లోని చట్ట ఉల్లంఘన అంశాలు ప్రజలు తెలుసుకోవాల్సిన సమాచార హక్కు ఉంది కాబట్టి, జరుగుతున్న ఎన్కౌంటర్లపై హక్కుల సంఘాలకు నిజనిర్ధారణ చేసే ప్రజాస్వామిక పరిస్థితులు కల్పించాలని లేదా గత మూడు నెలలుగా తెలంగాణ చత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లపై హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ నిర్వహించండి. దోషులకు చట్టబద్ధంగా శిక్షించాలని కూడా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది .
నిన్న ములుగు ఎన్ కౌంటర్ కూడా బూటకమని వారిద్దరినీ పట్టుకొని కాల్చి చంపారని కుటుంబీకులు తెలియజేస్తున్నారు. ఎన్కౌంటర్లపై నిజ నిర్ధారణకు కూడా భయపడుతుంది అంటేనే ఎన్కౌంటర్లు కూడా ప్రభుత్వ చట్ట ఉల్లంఘన హత్యలుగా ప్రజాస్వామిక వాదులు అందరూ భావించాల్సింది గా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఉమ్మడి ఆదిలాబాద్,ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న పోలీసు కూంబింగ్ లను వెంటనే నిలుపుదల చేయాలని ఎన్కౌంటర్ హత్యలను కట్టడి చేయాలని,పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
సాయంత్రం 4:30 గంటలు, సోమవారం.
19 అక్టోబర్,2020.
హైదరాబాద్....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు