నగరంలో ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం - అన్ని విధాలా ఆదుకుంటాం సిఎం కెసిఆర్

 ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం
 ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారు
అన్ని విధాలా ఆదుకుంటాం ...
మున్సిపల్ శాఖకు  రూ. 550 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ



భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఆర్ధిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి మళ్లి మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం చెప్పారు.

"గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పుల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం" అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్ధిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మేల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సీఎం చెప్పారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సరే, సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కాబట్టి బాధిత కుటుంబాల వివరాలు అధికారులకు చెప్పి, సాయం అందించాలని సీఎం కోరారు.    

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరద బాధిత పేదలకు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ రూ. 550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసింది.

సిఎం ఆర్ ఎఫ్ కు విరివిగా విరాళాలు ఇవ్వండి...సిఎం కెసిఆర్

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక-వాణిజ్య-వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.  కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

తమిళనాడు ముఖ్యమంత్రి  పళని స్వామికి కెసిఆర్ కృతజ్ఞతలు

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి  పళని స్వామికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. నగదుతో పాటు, బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, సీఎం పళని స్వామికి, తమిళనాడు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు