ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ రూ.10వేలు సాయం


ఏపీలో ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ‘వాహన మిత్ర’కింద డ్రైవర్లు అందరికీ రెండో విడత ఆర్థిక సాయం అందజేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు. ఓనర్ కమ్ డ్రైవర్లు.. ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ.. వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామన్నారు మంత్రి. ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు వచ్చాయని.. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించారు. అర్హులు సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు.. ఈ- సేవ, మీ- సేవ, సీఎస్ సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో డ్రైవర్లు తమ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇటు గ్రామ, వార్డు వాలంటీర్ల వద్ద కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడంతో ఈ ప్రక్రియ సులభతరం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు