టీహబ్ ఫెసిలిటీ సెంటర్‌ ప్రారంభించిన సిఎం కెసిఆర్

 

ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణల ప్రాంగణం




భాగ్యనగరంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీహబ్ ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 53.65 మీటర్ల ఎత్తులో (రెండు బేస్ మెంట్లు, 10 అంతస్తులు.. మూడు ఎకరాల్లో 3.6 లక్షల చదరవు అడుగుల్లో) నిర్మించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సెయింట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, టీహబ్ సీఈవో శ్రీనివాస్ రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. టీహబ్ ప్రాంగణం మొత్తం ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.

టీ హబ్‌పై  దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిద రంగాల ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో రతన్ టాటా కూడా నిలిచారు. ఇది భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు  భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ట్వీట్‌ చేశారు.  తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు ట్విటర్‌ పోస్ట్‌కు స్పందించిన టాటా టీహబ్‌ను ప్రశంసించారు.  ఈ సందర్భంగా  తెలంగాణా సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి టాటా అభినందనలు  తెలిపారు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు