ప్రధాని పర్యటనలో కెసిఆర్ గైర్హాజర్ అర్దం కాని చర్చనీయాంశం...

 

 


రాజకీయాలలో పలాయన వాదానికి ఏ మాత్రం విలువలుండవు. జనబాహుళ్యం లో నిలబడి ప్రజాతంత్ర .యుక్తులతో కలబడడమే ఇప్పటి  రాజకీయం.రాజకీయ రణ తంత్రంలో  యుక్తులతో పాటు కుయుక్తులు కూడ పన్నవచ్చు. ఈ విద్యలన్నింటిలో ఆరి తేరిన తెలంగాణ ముఖ్యమంత్రి సకల శాస్ర్త పారాయణుడిగా చెప్పుకునే  సిఎం కెసిఆర్ ఎందుకో కాని దేశ ప్రధాన మంత్రి  నరేంద్ర మోది తెలంగాణ రాష్ర్టానికి వచ్చినపుడుల్లా ముఖం చాటేస్తున్నాడు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కెసిఆర్ మండిపడుతున్నాడనే విషయం అందరికి తెల్సు. ముఖం చూడలేకనా లేక చూపించ లేకనా అనేది అందరికి అర్దం కావాలి కదా. కాని కెసిఆర్ ప్రధానమంత్రి  నరేంద్ర  మోది రాష్ర్టానికి వచ్చిన సందర్భాలలో గైర్హాజరై ఎటూ అర్దం కానిరీతిలో  చర్చనీయాంశంగా మారాడు.

హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్20 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది హైదరాబాద్ వచ్చిన నేపద్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అదే రోజు బెంగళూరు వెళ్లడం చూసే  వారికి చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే అయింది.

ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీతో కెసిఆర్ కు పొసగక పోయి ఉండి ఉండవచ్చు కాని ముఖం చూసుకోలేనంతగా వైరం ఏమొచ్చిందనే ప్రశ్నలు సామాన్యుల్లో కూడ  తలెత్తాయి.

ఈ విషయంలో అటు భారతీయ జనతా పార్టి నేతలు ఇటు టిఆర్ఎస్ నేతలు కౌంటర్లు, సెటైర్లతో దుమారం రేపారు.

ముఖ్యమంత్రి చాలా కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపీకి వ్యతిరేకంగా ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేక వైఖరి అవలంబించాడనేది సుస్పష్టం. బిజెపీకి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటి చేసి తన తడాఖా ఏంటో చూపిస్తానంటూ కెసిఆర్ బహిరంగంగా అనేక సార్లు సవాళ్ళు  కూడ విసిరారు. దేశంలో ఉన్నవి అటు బిజెపి ఇటు కాంగ్రేస్  రెండే రెండు ప్రధాన జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీలను ఒకే గాటన కట్టి కెసిఆర్  విమర్శలు చేస్తుండడంతో బహుశా ఆయన మూడో ఫ్రంట్ పెట్టబోతున్నాడా ఏమని రాజకీయ విశ్లేషకులు అనేక సార్లు విశ్లేషణలు చేశారు.

మూడు లేదు ఫ్రంట్ లేదు ఎవడయ్యా మీకు చెప్పిందంటూమీడియా సమావేశాల్లో ప్రశ్నించిన వీలేఖరులనే సిఎం కెసిఆర్ గద్రించిన సందర్బంగా  కూడ లేక పోలేదు.

చివరికి ఆయనే ఓ రో సందర్భంలో క్లారిటి ఇచ్చారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు కావల్సిన అవసరం ఉందని అందు కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే కెసిఆర్ దేశ పర్యటన తలపెట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో భేటి అయ్యారు. ప్రకటించిన విదంగా రైతుల ఉద్యమాల సందర్భంగా అసువులు బాసిన రైతులకు ఆర్థిక సహాయం అంద చేశాడు. ఇంకా అనేక మంది పార్టీల నేతలను కలవాల్సి ఉండగా వాయిదా వేసుకుని   కెసిఆర్ హైదరాబాద్ కు అర్దాంతరంగా తిరిగి వచ్చాడు. కాని తీరా ప్రధాన మంత్రి నరేంద్ర మోది హైదరాబాద్ లో దిగుతుంటే అదే సమయంలో కెసిఆర్ బెంగుళూరు విమానం ఎక్కడం అందరికి విచిత్రం వేసింది.

కెసిఆర్ ప్రధాని కార్యక్రమంలో పాల్గొని ఉంటే బిజెపి నేతల వైఖరి ఎలా ఉండేదో కాని ఆయన గైర్హాజరు కావడం వారికి మంచి ఆవకాశంగా లభించింది.

బెంగళూరులో కెసిఆర్ మాజి ప్రధాన మంత్రి దేవే గౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితో చర్చలు జరిపాడు. చర్చలేమిటో వాటి సారం ఏమిటో కాని మరో రెండు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందంటూ కెసిఆర్ మీడియా ఎదుట సంచలన ప్రకటన చేశాడు. అయితే ఆ సంచలనం ఏమిటనేది  మీడియా ఊహాకే వదిలి వేశారు.

కెసిఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పటాన్ని ఎవరూ కాదనరు ఎవరూ వ్యతిరేకించరు. ప్రధాన మంత్రి రాక సందర్బంగా ప్రోటోకాల్ మేరకు ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలికి ఆయన వెంట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే

ఆయన విమర్శల పాలయ్యే వారు కాదు. కేంద్రం పైనా , ప్రధాని నరేంద్ర మోది పైనా కోపం ఉండవచ్చు కాని  ప్రధాన మంత్రి హోదాకు అయినా ఆయన విలువ ఇచ్చి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నరేంద్ర మోది విషయంలో ఓ సందర్భంలో కెసిఆరే ఆయన దేశానికి ప్రధాన మంత్రి అని ఆయన్ని గౌరవించాలని సెలవిచ్చిన సందర్బాలు ఉన్నాయి.

ప్రధాని నరేంద్ర మోది హైదరాబాద్ కు వచ్చిన రోజే తమిళనాడు రాష్ర్టం మద్రాస్ లో కూడ అధికారిక పర్యటన జరిపారు. అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడ కేంద్రం తీరుపైనా ప్రధాని నరేంద్ర మోది వ్యవహారంపైనా  ఆగ్రహంతో ఉన్నవాడే. కాని ఆయన ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ప్రధాన మంత్రి స్వాగత సత్కారాల్లో ఎక్కడా ఆ హోదాకు గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించాడు.

ఒకే రోజు రెండు దాక్షిణాధి రాష్ర్టాలలో జరిగిన ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా అటు  స్టాలిన్  ఇటు కెసిఆర్ ఎట్లా భిన్నంగా వ్యవహరించారనే వార్తల్లో  జాతీయ మీడియా ప్రాధాన్యతా క్రమ ప్రస్తావన తెచ్చింది.

స్టాలిన్ ప్రధాని ఎదుటే కేంద్రం రాష్ర్టాల పట్ల అనుసరిస్తున్న తీరుపట్ల ప్రధానంగా తమిళనాడు రాష్ర్ట ప్రయోజనాలను ప్రస్తువిస్తూ  ప్రధాని ముఖంగా నిలదీసినంత పనిచేశాడు. కేంద్రం నుండి తమిళనాడుకు నిధులు రావడం లేదని ధ్వజ మెత్తాడు.జిఎస్టి బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసాడు. తమిళనాడు విద్యార్థులకు నీట్ ఎగ్జామ్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని మరో సారి కోరాడు. తమిళ నాడు రాష్ర్టంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో  తమిళం అధికార భాషగా ప్రకటించాలని  విజ్ఞప్తి చేశాడు.  కేంద్ర, రాష్ర్ట సంభందాల విషయంపై మాట్లాడుతూ రెండు కల్సి పనిచేస్తేనే ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయని స్టాలిన్ నొక్కి చెప్పాడు.

జాతీయ రాజకీయాల పట్ల కెసిఆర్ కు ఉన్నస్పష్ట మైన అవగాహన,  వ్యూహ  ప్రతివ్యూహాలు ఆయన కుండి ఉండ వచ్చు. ఆయన దేశ్ కినేత అయినా ముందు ముందు రాష్ర్ట పతి అయినా  లేదా ప్రధాన మంత్రి కావాలనుకున్నా కావచ్చు.

 కాని రాజ్యాంగబద్దమైన మర్యాదలను విలువలను పరిరక్షించాల్సిన  భాద్యత, కర్తవ్యం కూడ  ఆయన పైనే ఉంది.

శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగ సంస్థల పట్ల ఆయా సంస్థానాదీశులు తప్పుడు సంకేతాలు ఇచ్చే విదంగా వ్యవహరించక పోతే ప్రజాస్వామ్యంలో హుందాగా ఉంటుంది. ఎట్లాగూ జాతీయ రాజకీయాలలో ఆయన అడుగుపెట్టబోతున్నాడు కనుక  విలువల విషయంలో చిలువలు పలువలకు తావీయక పోవడం మంచిది.

మహేందర్ కూన

జర్నలిస్ట్ 

(ప్రజాతంత్ర తెలుగు దినపత్రికలో 28-04-2022 ప్రచురితం)

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు