"నేను దేవుళ్ళను మొక్కను ప్రజలకు మొక్కుతా 20 ఏండ్లుగా నన్ను కాపాడుకున్నరు. ఇక్కడ ఎవరి ఆటలు సాగవు" అని మాజి మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ లో మీడియా తో మాట్లాడారు. హుజురాబాద్ నియోజక వర్గంలో ఎవరి దాదాగిరి నడవదని హెచ్చరించారు. మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గం నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
‘అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్న వారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సరే మీరు సాయం చేశారా?. నాపై తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. ఎవడూ వెయ్యేళ్ళు బ్రతకరు.. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు 2023 లో నువ్వు ఉండవు అంటూ హెచ్చరించారు.
చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. నువ్వు (గంగుల) ఎన్ని టాక్స్లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది. 2006లో కరీంనగర్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారంతో మర్యాద పాటిస్తున్నా. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారు’ అని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box