పొరపాటు - ఏమరు పాటు
వాక్సిన్లు వేసే వారు తీసుకునే వారు ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా పొరపాట్లు జరిగి పోతుంటాయి. బీహార్ లో ఓ 63 ఏళ్ల మహిళకు ఒకే సారి ఐదు నిమిషాల తేడాతో ఓ లైనులో కోవాగ్జిన్ మరో లైన్ లో కోవిషీల్డ్ ఇచ్చారు. ఈ విషయంలో ఆ మహిళ పొరపాటుతో పాటు వైద్య సిబ్బంది ఏమరు పాటు కూడ ఉంది. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్కు చెందిన సునీలా దేవి వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్కు వచ్చింది. ఓ కౌంటర్ వద్ద క్యూ లైనులో నిలబడి ముందుగా కోవాగ్జిన్ తీసుకుంది. ఆ తర్వాత పక్కనే మరో కౌంటర్ వద్ద రెండో క్యూలైన్ లో కోవిషీల్డ్ ఇస్తున్నారు. మొదటి లైను తర్వాత రెండో లైన్ లో కూడ ఇంజక్షన్ తీసుకోవాలో ఏమోనని ఆ మహిళ రెండో కౌంటర్ వద్ద క్యూలైన్ లో వెళ్లి రెండో డోసు కూడ తీసుకుంది. రెండో లైనులో నిలబడి కనీసం ఆమె మొదటి క్యూలైనులో వాక్సిన్ తీసుకున్న విషయం కూడ ఎవరికి చెప్పలేదు. వైద్య సిబ్బంది కూడ ఆ విషయం విచారించ లేదు. సునీలా దేవి ని ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే కోవిషీల్డ్ ఇచ్చారు. అనంతరం ఆ మహిళ తన కుటుంబ సబ్యులకు ఈ విషయం చెప్పడంతో గ్రామస్తులకు తెల్సి అధికారులతో గొడవకు దిగారు. వాక్సినేషన్ కేంద్రం వద్ద ధర్నా చేశారు.
విషయం తెలియడంతో జిల్లా ఆరోగ్య అధికారి.. సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. అయినప్పటికీ ఆమెను అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులకు హెల్త్ ఆఫీసర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సునీలా దేవిని 14 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఆంటి బాడీస్ టెస్టు నిర్వహిస్తామని కోవిడ్ 19 నోడల్ అధికారి డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box