ఆర్టీసీ బస్సుకు అడ్డం తిరిగి ఆపేసిన మహిళ…వరంగల్ లో హల్ చల్

 


బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలన్న కండక్టర్


ఆర్టీసీ బస్సులో తన దివ్యాంగుడైన కొడుకును ఎక్కించు కొనందుకు బస్సుకు అడ్డం తిరిగి ఓ మహిళా చుక్కలు చూపించారు.  బస్సు కండక్టర్  పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపకుండా వెళ్లిన బస్సును ఆటో ద్వారా వెంబడించి బస్సుకు అడ్డం తిరిగి ఆందోళన చేపట్టారు.ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు.

వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి  నెక్కొండ-మహబూబాబాద్‎
వెళ్లే ఆర్టీసీ బస్సులో తన ఇద్దరు కూతుళ్లను సామగ్రితో సహా ఎక్కించారు.

దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి బస్సు కండక్టర్ నిరాకరించాడు. అప్పటికే బస్సు నిండిపోయి.. ఒకరినొకరు తోసుకుఅంటున్నారు. ‘బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని’ కండక్టర్ సూచించారు.
అప్పటికే తన ఇద్దరు కుమార్తెలు బస్సులో ఉన్నారన్న విషయం తెలియని డ్రైవర్.. కండక్టర్ సూచన మేరకు ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంతదూరం బస్సు వెనకాల పరుగెత్తారు. చివరకు ఓ ఆటో తీసుకొని వెళ్లి శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బస్సును అడ్డగించారు. నడి రోడ్డుపై ఆ మహిళ ఆగ్రహం తో బస్సు డ్రైవర్ కండక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నీ బస్సెట్ల కదుల్తుందో చూస్తానంటూ మండిపడ్డారు.

బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా, దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళతారని బస్సు డ్రైవర్, కండక్టర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అరగంటకుపైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో.. ప్రయాణికులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

మీ కుమారుడిని ఆటోలో నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే కలిసి వెళ్తామని చెప్పినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నించి పట్ట పగలే చుక్కలు చూపించింది. బస్సును తిరిగి బస్టాండ్‎కు తీసుకెళ్లి.. తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టారు.
చివరికి ట్రాఫిక్ పోలీసులు కలుగచేసుకుని దివ్యాంగుడైన ఆమె కుమారున్ని  బస్సు ఎక్కించి పంపించారు.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు