ప్రధాన మంత్రిని కల్సిన సిఎం డిప్యూటి సిఎం

 


తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసారు. 

తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశామని భట్టి తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం కోసం.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని.. కానీ విభజన చట్టంలోని హామీల అమలును గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు. అయితే.. ఆ విభజన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రధానిని కోరినట్టు చెప్పుకొచ్చారు.


బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరినట్టు భట్టి వివరించారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారని... అందులో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినట్టు పేర్కొన్నారు. వాటితో పాటు.. ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కూడా అడిగినట్టు చెప్పారు. నేషనల్‌ హైవేస్‌ అథారిటీకి సంబంధించి 14 ప్రపోజల్స్‌ అప్‌గ్రేడ్‌ కోసం పెండింగ్‌లో ఉన్నాయని.. వాటి కూడా వెంటనే మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు.


విభజన చట్టం ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు కూడా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటికి సైతం వెంటనే మంజూరు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసినట్టు భట్టి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయ్యిందని.. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని వివరించినట్టు తెలిపారు. అయితే.. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా.. తాము చర్చించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని భట్టి వివరించారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు