హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన



 హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన

హరిభూషణ్,

24-06-2021
సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యంలోని మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు కా|| భారతక్క లు కరోనా కారణంగా మరణించినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

జగన్ ప్రకటన పూర్తి పాఠం...

కామ్రేడ్ హరిభుషణ్ (యాప నారాయణ), కా|| సిద్ధబోయిన సారక్క (భారతక్క) లకు విప్లవ జోహార్లు

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు కా|| హరిభూషణ్ (యాప నారాయణ), దండకారణ్యంలోని మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు కా|| సిద్ధబోయిన సారక్క ( భారతక్క) ఇరువురు కరోనా లక్షణాలతో భాదపడుతూ తుదిశ్వాస విడిచారు. కా॥ యాపనారాయణ చాలా కాలంగా కొనసాగుతున్న బ్లాంకైటీస్, అస్తమా వ్యాదులు తోడై 21-జూన్ 2021న ఉదయం 9గంటలకు అమరత్వం చెందారు. కా॥ సిద్ధబోయిన సారక్క (భారతక్క) 22 జూన్ 2021న ఉదయం 9.50 గంటలకు తన తుది శ్వాస విడిచింది. వారి అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేశాము. 22వ తేదీన వారి సంస్మరణ సభను జరిపి వారికి శ్రద్ధాంజలి ఘటించాము. ఈ సంధర్భంగా కా. హరిభూషణ్, కా.భారతక్కల కుటుంబ సభ్యులకు తెలంగాణ‌ రాష్ట్ర కమిటీ తరుపున విచారాన్ని, సంతాపాన్ని తెలియ జేస్తున్నాము.

కా|| యాప నారాయణ మహబూబ్ బాద్ జిల్లా, గంగారం మండలం మడగూడెం గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు నర్సంపేటలో చదివి, హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే నగ్జల్బరీ శ్రీకాకుళ రైతాంగ ఉద్యమాల ప్రభావంతో దేశవ్యాప్తంగా రగులుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ప్రభావం జగిత్యాల జైత్రయాత్ర నుండి అదిలాబాద్, కరీనగర్, వరంగల్ జిల్లాల్లోకి పాకి పెద్ద ఎత్తున కొనసాగిన రైతాంగ పోరాటాలకు విద్యార్థులు నాయకత్వం వహించడంతో వందలాది విద్యార్థుల పై విప్లవ రాజకీయాల ప్రభావం పడింది. అందులో భాగంగానే కా|| యాప నారాయణ పై కూడా విప్లవ రాజకీయాలు ప్రభావితం చేశాయి. వాటి ప్రభావంతో హన్మకొండలో డిగ్రీ విద్యను అభ్యసిస్తూ ఆర్ఎస్ యూ నాయకత్వంలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ క్రమంలో పార్టీ నిర్ణయం మేరకు 1991లో అటవి దళంలో చేరాడు. కొద్ది కాలం నెక్కొండ దళంలో పని చేసి అక్కడి నుండి పాడవ దళంలో సభ్యుడుగా డిప్యూటి కమాండర్ గా, ఆర్గనైజర్ గా భాద్యతలు చేపట్టి అచలాంచలుగా ఎదిగాడు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ మెంబర్ గా కొనసాగుతూ, 1998 నవంబర్ లోఉత్తర తెలంగాణ మొదటి ప్లాటూన్ బాధ్యతలు తీసుకున్నాడు. 2000 సం||రాలో కేంద్ర కమిటీ ప్రొటెక్షన్ ప్లాటూనుకు బదిలీ అయ్యి 2005 వరకు కొనసాగాడు. కొద్ది కాలం ఇన్స్ట్రక్టర్ గా కూడా పని చేశాడు. 2005లోనే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా ప్రమోట్ అయ్యాడు. ఇదే సంవత్సరం చివరిలో విప్లవోద్యమ అవసరాల రీత్యా తిరిగి బదిలిపై ఉత్తర తెలంగాణకు వచ్చి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వచ్చాడు. 2015 ప్లీనంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2018 నవంబర్‌లో కేంద్ర కమిటీ సభ్యూడిగా ఎన్నికయ్యాడు.
33 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో గెరిల్లా జోన్ నిర్మాణ కృషిలో తీవ్రమైన శత్రువు నిర్బంధంలో అనేక ఎత్తుపల్లాలను, అటు పోట్లను, కష్ట నష్టాల ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఏనాడూ మడమ తిప్పి చూడలేదు. ప్రతి మలుపులో డైనమిక్ నిర్ణయాలు తీసుకున్నాడు. కష్ట సమయాల్లో ప్రజలతో, క్యాడర్లతో వెంట వుండి మార్గ నిర్దేశం చేస్తూ వచ్చాడు.

కామ్రేడ్ హరిభూషణ్ పాండవ దళంలో కమాండర్ గా, ఆర్గనైజర్ గా ఇక్కడే పది సంవత్సరాల పాటు రాజకీయ నిర్మాణ కృషి చేశాడు. మార్క్సిజం-లెనినిజం ముసుగులో కొనసాగుతున్న రివిజనిజానికి వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటం చేశాడు. ఎంఎల్ పార్టీల రంగు బహిరంగం చేస్తూ ప్రజలను నిజమైన విప్లవ రాజకీయాల వైపు నిలబెట్టాడు. .

శత్రువు నిర్భంధంతో తెలంగాణ విప్లవోద్యమం దెబ్బతిని వర్గ సంఘాలు పని చేయాలేని స్థితిలో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నూతన పోరాట నిర్మాణ రూపాలు చేపట్టి మిలిటెంట్ ప్రజా పోరాటాలు చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని పురోగమింప జేశాడు.

1998 నుండి 2015 వరకు తను మిలటరీ విభాగంలో భాద్యతలు చేపట్టి అనేక గెరిల్లా చర్యలకు నాయకత్వం వహిస్తూ ప్రజా యుద్ధ అభివృద్ధికి విశేష సేవలందించాడు.

కా|| సిద్దబోయిన సారక్క (భారతక్క) ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో అదివాసి పేద కుటుంబంలో జన్మించింది. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో ప్రభావితమై, ఆదివాసి ప్రాంతంలో ఫారెస్టు అధికారుల జులుంను వ్యతిరేకిస్తూ 1985లో ఏటూరు నాగారం మొట్టమొదటి దళంలో చేరి తన విప్లవ ప్రస్థానాన్ని ఆరంభించింది. 86లో అరెస్టు అయ్యి రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించింది. తను జైలు నుండి బయటికి వచ్చే నాటికి అప్రకటిత యుద్ధం కొనసాగుతున్నప్పటికి వెరవకుండా మళ్ళీ దళంలో చేరింది. 1989లో తన సహచరుడు కా|| కోటి హన్మన్న అమరుడు కావడం, అదే సమయంలో కా| అఖిలాష్ జన్మించడం జరిగినప్పటికి తను ఏమాత్రం కలత చెందలేదు. ప్రజల కోసమే గట్టిగా నిలబడింది.

తన కుమారుడు పెరిగి పెద్దయ్యాక నిస్వార్ధంగా కామ్రేడ్ అఖిలాష్ ను విప్లవోద్యమంలో తీసుక వచ్చి ఎదిగించుకుంది. 2020 జూన్లో కొడుకు కా॥ అభిలాష్ గడిచిరోలిలో అమరుడయ్యాడు. సంవత్సరం తిరగకుండానే 29 సంవత్సరాలు కలిసి జీవించిన కా| కత్తి మోహన్ రావు 10 జూన్-2021లో గుండె పోటుతో మరణించారు. 12 రోజుల వ్యవధి లోనే కా|| భారతక్క తుదిశ్వాస విడిసింది. వారి కుటుంబం ప్రజల కోసమే పూర్తి అంకితమై తమ ప్రాణాలను అర్పించారు. 36 సంవత్సరాల విప్లవ జీవితంలో తను ఎన్నో నిర్భంధాలను తట్టుకొని, కష్టాలకు ఓర్చి, అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ విప్లవోద్యమ పురోగమనంలో తమ వంతు భూమిక పోషించింది.

1992లో ఏటూర్‌ నాగారం దళంలో పని చేసింది. కొద్దికాలం కా|| కత్తి మోహాన్ రావుతో పాటు ప్రెస్ విభాగంలో పని చేసింది. 2001లో గుండాల ఎల్ ఓఎస్ కమాండర్ గా, ఆర్గనైజర్ గా పని చేసింది. 2002లో అనారోగ్యనికి గురై హస్పటల్ కు వెళ్ళి రెండవ సారి అరెస్టు అయ్యింది.2005లో జైలు నుండి వచ్చి తిరిగి దళంలో భాద్యతలు చేపట్టింది. 2008లో దండకారణ్యంకు బదిలి అయిన నుండి మాడ్ డివిజన్‌లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్ పాఠశాలకు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలోనే కా॥ భారతక్కను కోవిడ్ ఫండామిక్ వెంటాడి మన నుండి భౌతికంగా దూరం చేసింది.

మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ విప్లవోద్యమంలో కా. హరిభూషణ్, కా. భారతక్క అనేక శత్రువు నిర్భంధాలను జయిస్తూ గెరిల్లా జోన్ అభివృద్ధికి పాటుపడిన మహోన్నతులు, త్యాగ ధనులు ఈ రోజు మన ముందు లేరు. వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు కా|| హరిభూషణ్, కా|| భారతక్కలను చంపడానికి చాలా సంవత్సరాలుగా ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారు. పాశవిక నిర్బంధాలను ప్రయోగించారు. సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కోవర్టులను పంపారు. విషప్రయోగాలను చేశారు. కాని ప్రజలు, పార్టీ శ్రేణులు, పిఎల్ జీఏ... ప్రభుత్వ కుయుక్తులను తిప్పి కొడుతూ ప్రియతమ నాయకులను కాపాడుకున్నారు. ఆఖరికి సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం చేసిన పర్యావరణ విధ్వంసంతో ప్రమాదకర కరోనాను సృష్టించి ఈ సమాజంపై వదిలారు. అందులో భాగంగా కోవిడ్ 19 రూపంలో కా| హరిభూషణ్, కా|| భారతక్కను బలికొన్నారు. వీరే కాదు దోపిడీ వర్గాలు సృష్టించిన కరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను బలితీసుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాద కరమైనా కరోనా ఆర్థిక వ్యవస్థలనే కుదిపేస్తున్నది. వీటికి మూల కారణమైన సామ్రాజ్యవాదులను, దళారీ నిరంకుశ పెట్టుబడి దారులను, భూస్వామ్యాన్ని కూల్చకుండా ప్రజలకు శాశ్వత విముక్తి లేదు. నూతన ప్రజా స్వామిక విప్లవమే పీడిత ప్రజలకు ఏకైక మార్గం. కా|| హరిభూషణ్, కా|| భారతక్కలు ఇదే మార్గంలో చివరి వరకు పోరాడారు. వారి మార్గంలోనే మనమంతా తుది వరకు పయనిస్తూ వేలాది మంది హరిభూషణ్ల‌ను, భారతక్కలను సృష్టించుకుందాం. వారి ఆశయాలను పరి పూర్తి చేద్దాం.
విప్లవాభివందనాలతో
అధికార ప్రతినిధి
జగన్
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
తెలంగాణ రాష్ట్ర కమిటీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు