అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన ఎపి సీఎం జగన్

 


తూర్పు గోదావరి జిల్లాలోని  అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గత  ఏడాది సెప్టెంబర్ 5న గుర్తు తెలియని దుండగులు రథం దగ్ధం చేశారు.  ప్రభుత్వం 95 లక్షలు వ్యయం చేసి  కొత్త రథం సిద్దం చేయించింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కొత్తగా తయారు చేసిన రథాన్ని జగన్ ప్రారంభించారు. ఈనెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. 

40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు