ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
• ఆ దిశగా చర్యలు చేపట్టండి
• భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి
• అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై శనివారం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్ లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్ లలో పలు మార్పులు, చేర్పులను సూచించారు సీఎం. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్నారు సీఎం. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box