మతతత్వ బిజెపీని సాగ నంపాలి - ఇందూరు సభలో సిఎం కెసిఆర్

 



మత విద్వేషాలు రెచ్చ గొట్టి మతం మంటల్లో రక్తం పారించాలని చూస్తున్న  మతతత్వ బిజెపీని సాగ నంపాలని  సిఎం కెసిఆర్ నిజామాబాద్ సభలో పిలుపు నిచ్చారు. బిజెపి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. 

సోమవారం నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తో పాటు జిల్లా  క‌లెక్ట‌ర్ కార్యాల‌య భవణ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో కేంద్రం లోని బిజెపి సర్కార్  పై నిప్పులు చెరిగారు. బిజెపి ప్రభుత్వం రైతుల మోటార్ల లెక్కలు తీయమంటోంది. రైతు మోటర్లకు  మీటర్లు పెట్టాలని చెబుతున్నారు. రైళ్లు విమానాలు విక్రయించి ఇప్పుడు రైతుల మీద పడ్డారు.  రైతుల భూములను తీసుకుని కార్పోరేట్ కంపెనీలకు  అప్పగించాలని చూస్తున్నారు. ఎరువుల ధరలు వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ధరలు పెరగడంతో సాగు భారంగా మారింది. ఎన్ ఎంపీల పేరుతో వ్యాపారులకు పన్నెండు లక్షల కోట్లు దోచి పెట్టింది. రైతులకు మాత్రం ఉచితాలు ఇవ్వవద్దని ప్రధాని చెబుతున్నారు. ఇవన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

 బిజెపి ముక్త బారత్ రావాలని కెసిఆర్ అన్నారు. 2024లో దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతోందని.. అప్పుడు దేశంలోని రైతులందరికీ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్ర‌పంచంలో ఏ దేశంలో కూడా లేన‌టువంటి వ‌రం భార‌త‌దేశానికి ఉందన్న కేసిఆర్ దేశంలో 83 కోట్ల ఎక‌రాల భూమి ఉందని  అందులో 41 కోట్ల ఎక‌రాలు వ్య‌వ‌సాయానికి అనుకూల భూములు ఉన్నాయని అన్నారు. 

దేశంలో అనేక నదులు ఉన్నాయని  కానీ ఒక్క‌  పెద్ద ప్రాజెక్టు కూడ లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు క‌ట్ట‌లేదని  కొత్తగా ఫ్యాక్ట‌రీ పెట్ట‌లేదని విమర్శించారు.  ఉన్న కంపెనీలను కూడా అమ్ముకోవడంపైనే కేంద్రం దృష్టి పెట్టిందని విమర్శించారు. రైతు సంఘాలు, రైతు బిడ్డ‌లు స‌మావేశాలు పెట్టి రైతు వ్య‌తిరేక విధానం అవ‌లంభిస్తున్న పార్టీల‌ను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.

నిజాం సాగ‌ర్ ను అప్ప‌ట్లో నిర్ల‌క్ష్యం చేశారన్నారు. కాళేశ్వ‌రం నీళ్లు త్వ‌ర‌లోనే సింగూరుకు రాబోతున్నాయని  అలా వ‌చ్చిన త‌ర్వాత గుంట భూమి కూడా ఖాళీగా ఉండ‌దని మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ ఏ ఒక్క ప‌థ‌కం కూడా దేశంలో ఎక్క‌డా లేదని  అన్ని రంగాల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చిన రాష్ట్రం ఏదీ లేదుని కెసిఆర్ అన్నారు.

దేశం బాగుప‌డాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన రాజ‌కీయాలు ఉండాలని కేసీఆర్ అన్నారు. అహంకార రాజ‌కీయాలు ఉండ‌కూడ‌దని ప్ర‌తిప‌క్షాల‌ను చీల్చి చెండాడి, ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొనేలా ఉండ‌కూడ‌దని కేసీఆర్ అన్నారు. ప్ర‌జాస్వామ్యంతో, స‌హ‌న‌శీల విధానంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్ర‌జాస్వామ్య శ‌క్తుల రాజ్యం రావాలని అన్నారు. 28 రాష్ట్రాల రైతులు జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని తనను ఆహ్వానించారని  జాతీయ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ఇందురు నుండే ప్రారంభిస్తామని  తెలంగాణ‌ను బాగు చేసుకున్నట్లే  దేశాన్ని బాగు చేసుకుందామని కెసిఆర్ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు