కెసిఆర్ నయా నిజాం నవాబ్ - ఇదే ఆయన ఆఖరి ఫర్మాన - జేపి నడ్డా

 


కెసిఆర్ పాలనకు ప్రజలు చెరమ గీతం పాడనున్నారని వచ్చే ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆ పార్టి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా అన్నారు. 

శనివారం సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన బండి సంజయ్ పాద యాత్ర ముగింపు సభలో నడ్డా ప్రసంగించారు.

కెసిఆర్ వ్యవహారశైలిని తప్పుపడుతు ఆయనను నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గా  అభివర్ణించారు. ఉస్మాన్ అలి ఖాన్  సభలు జరుపు కోకుండా ఫర్మానా జారి చేసి నట్లే కెసిఆర్ ఫర్మానా జారిచేసారని ఇదే ఆయన ఆఖరి ఫర్మానా అని వచ్చేది బిజెపి ప్రభుత్వ మని నడ్డా ఘంటా పథంగా చెప్పారు.  బండి సంజయ్ పాద యాత్రకు అడుగడుగునా ఆంక్షలు విధించినా ప్రజలు ఘనస్వాగతం పలికారని అన్నారు. తనకు స్వాగతం పలకాల్సిన  ప్రతి చోట నిషేదాజ్ఞలు విధించారన్నారు. కోర్టు అనుమతులు తీసుకుని సభ జరపాల్సి వచ్చిందని అన్నారు.  కెసిఆర్ ఆయన కుటుంబం ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఎటిఎం గా మారిందన్నారు. 40 వేల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు కు లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశారని  విమర్శించారు. కెసిఆర్ అవినీతి పాలనను అంత మొందించి వెలుగులు నింపేందుకే  పాదయాత్రలన్నారు.  కెసిఆర్ తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. మజ్లీస్ పార్టీకి భయపడే కెసిఆర్ తెలంగాణ అమర వీరులకు ద్రోహం చేశారని విమర్శించారు. కేంద్ర పథకాలను కెసిఆర్ నిర్వీర్యం చేశారన్నారు. వరంగల్ లో జైళును కూల్చి నిర్మిస్తామన్న మల్టి స్పెషాల్టి ఆసుపత్రి ఏ మైందన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేసిందని.. ఎన్నో నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాను చెప్పిన లెక్కలపై సీఎం కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని..దీనిపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
గణాంకాలతో  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన  నిధులు వివరిస్తూ కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తుంటే..కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.



నాలుగో విడత పాద యాత్ర ప్రకటించిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తాము నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అయితే ఎక్కడి నుండి ఎక్కడికి పాద యాత్ర నిర్వహిస్తారని వివరాలు వెల్లడించ లేదు.
బంహిరంగసభలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నారు.  కెసిఆర్ పాలనలో బిజెపి నేతలను, కార్యకర్తలను  జైళ్ళ పాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ ను గద్దె దించేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్నారు.
ప్రజల కోసం పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై పిడి ఆక్టులు పెట్టి జైళ్ల పాలు చేసినా వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. చర్లపల్లి జైళులో కెసిఆర్ కు గది సిద్దంగా ఉందన్నారు. బిజెపి ఎన్నడూ పదవుల కోసం మతకలహాలు సృష్టించలేదన్నారు. సిఎం పదవి కోసమే కెసిఆర్ విద్వేషాలు రగిలించి బిజెపి పై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.



ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ ఇంటికి నడ్డా

ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఇంటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా  తరుణ్ చుగ్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇతర ముఖ్య నాయకులు వెళ్లి చర్చలు జరిపారు. తెలంగాణ తుది విడత ఉద్యమంలో విద్యావేత్తగా భాగస్వామ్యం వహించి  పోరాడిన ప్రొఫెసర్ వెంకటనారాయణ తో నడ్డా తెలంగాణలో పరిస్థితులు అడిగి తెల్సుకున్నారు. కెసిఆర్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రొఫెసర్ వెంకట్ నారాయణ వారికి వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని నడ్డా పేర్కొన్నారు.
మాజి వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ లింగ మూర్తితో పాటు పుల్లూరి సుధాకర్, టి.  శ్రీనివాస్, డా.స్వర్ణలత, డా.మామిడాల ఇస్తారి తదితరులు భేటీలో పాల్గొన్నారు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు