దిశ ఎన్ కౌంటర్ కేసులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు

 పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని సూచించిన సిర్పూర్కర్ కమిషన్

కేసు కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

నివేదికను బహిర్గత పరచవద్దన్న అభ్యర్థనను తిరస్కరించినకోర్టు



దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయంలో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక వెల్లడించింది. సుప్రీం ఆదేశాలతో కమిషన్ న్యాయవాది.. వాద ప్రతివాదులకు కమిషన్ రిపోర్ట్ అందజేశారు. 387 పేజీలతో కూడిన ఈ నివేదికలో కీలక విషయాలు పొందుపరిచారు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను కాల్చి చంపారని పేర్కొన్నారు. తక్షణ న్యాయం కోసమే ఎన్ కౌంటర్ అని స్పష్టం చేశారు.ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యం లేదని కమిషన్ స్పష్టం చేసింది. పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని సిర్పూర్కర్ కమిషన్ సూచించింది. 

 విచారణ పేరుతో నిందితులను అధికారులు వేధించారని.. పోలీస్ మాన్యువల్ కు విరుద్ధంగా విచారణ జరిగిందని తెలిపారు. నిందితులు కస్టడీలో ఉన్నప్పటి నుంచి కేసు నమోదు చేసిన అధికారులు కాకుండా... ఇతర  వింగ్ అధికారులు వెంబడే ఉన్నారని పేర్కొన్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, గ్రేహౌండ్స్ పోలీసులు నిందితులు విచారణలో పాల్గొన్నారని కమిషన్ నివేదికలో తెలిపింది. పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి. జానకిరాం, ఆర్. బాలూ రారోడ్, డి.శ్రీకాంత్ పై విచారణ జరపాలని కమిషన్ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది. 

బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన  సుప్రీంకోర్టు

అంతకుముందు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ ఎన్ కౌంటర్‌పై విచారణ జరిపిన జస్టిస్ విలాస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ తెలంగాణ హైకోర్టుకు పంపించాలని ఆదేశించింది. రిపోర్టుపై నిర్ణయం హైకోర్ట్ తీసుకుంటుందని స్పష్టంచేసింది. కమిషన్ రిపోర్టు కాపీని సంబంధిత పక్షాలకు అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

కమిషన్ నివేదికను సీల్డ్ కవర్ లోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నివేదిక గోప్యంగా ఉంచాల్సిన అవసరమేమి లేదని స్పష్టం చేసింది. కొందరు తప్పుచేసినట్టు తేలిందని, దానిని ప్రభుత్వం పరిశీలించాలని న్యాయస్థానం ప్రకటించింది. రిపోర్టు వచ్చిందంటే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు