జోలికొస్తే ఖబడ్దార్..నశం నశం చేస్తాం..బిజెపిని హెచ్చరించిన కెసిఆర్

 


పిడికెడు లేని బీజేపీ నేతలు తమ జోలికి వస్తే ఖబడ్దార్‌ నశం నశం  అంటూ సీఎం కేసీఆర్‌  తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు. జాగ్ర‌త్త న‌రేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ‌. జ‌న‌గామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్ర‌స్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్ర‌త్త‌లో మీరు ఉండండి. మా జాగ్ర‌త్త‌లో మేం ఉంటాం అని కేసీఆర్ బిజెపీని హెచ్చరించారు. 

శుక్రవారం జనగామలో  జిల్లా కలెక్టర్ భవణ సముదాయాన్ని  ప్రారంభించిన అనంతరం యశ్వంతాపూర్  బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పెట్టుకుంటే ఢిల్లీ కోట‌లు బ‌ద్ద‌లు కొడుతాం.. న‌రేంద్ర మోదీ జాగ్ర‌త్త అని కేసీఆర్ హెచ్చ‌రించారు. ఖబర్ధార్‌ మోదీ.. ఇది తెలంగాణ అడ్డా అంటూ నిప్పులు చెరిగారు. నీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోదీని ఉద్ధేశిస్తూ విమర్శించారు. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడటానికి సిద్ధమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్ర‌జ‌లు న‌న్ను ఆశీర్వ‌దించి అసెంబ్లీకి పంపితే తెలంగాణ‌ను సాధించామని, మీరందరూ పంపిస్తే ఢిల్లీ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధమని అన్నారు. 

ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌రు. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌రు. మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌రు. నువ్వు ఇవ్వ‌కున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను త‌రిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం. ప్ర‌జ‌ల శ‌క్తితోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం. అద్భుత‌మైన పంట‌ల‌ను పండించుకున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఉన్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు