ఆకలి కేకల్లో ఇండియాది 101 స్థానం

 బంగ్లాదేశ్‌ , నేపాల్ , పాకిస్థాన్‌లో మెరుగు



దేశంలో పౌరులందరికీ ఆహార భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం మరో సారి బయట పడింది.   పొరుగు దాయాది దేశాలకన్నా భారత దేశంలో ఆకలి కేకలు మిన్నంటాయని  ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలనివ్వటంలేదని ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌- జీహెచ్‌ఐ) 2021 నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఆహార నిల్వలకు కొదువ లేనప్పటికి  అవి ఆకలితో అలమటించే  అన్నార్తులను చేరడం లేదు.  తాజాగా, 116 దేశాల జాబితాతో వెలువడిన ప్రపంచ ఆకలి సూచీలో (global hunger index 2021) భారత్‌ 101వ స్థానంలో ఉంది.

పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ (76), నేపాల్ (76), పాకిస్థాన్‌ (92) ఇదే విభాగంలో ఉన్నప్పటికీ..మన కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. గతేడాది ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో నిలిచింది. ఆకలి బాధ నివారణలో గత ఏడాది 93 దేశాలు మనకన్నా అగ్రభాగాన ఉంటే.. ఈ ఏడాది అటువంటి దేశాల సంఖ్య 100కి పెరిగింది. పర్యవేక్షణ కొరవడటం, పోషకాహార లోపాలను సరిదిద్దలేకపోవటం వంటివి మన దేశం వెనుకబాటుకు కారణాలుగా ఉన్నాయని విశ్లేషించారు.

చైనా, కువైట్‌, బ్రెజిల్ తదితర 18 దేశాలు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ప్రపంచ ఆకలి సూచీ వెల్లడించింది. దేశంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువులేని వారి శాతం 1998-2002 మధ్య 17.1గా ఉండగా.. 2016-2020 మధ్య ఈ సంఖ్య 17.3కి పెరిగిందని తెలిపింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 2030 నాటికి కూడా 47 దేశాలు తీవ్ర పోషకాహార సమస్యలు ఎదుర్కొంటాయని పేర్కొంది.

కరోనా వైరస్, మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్, కోవిడ్ ఆంక్షలు ఈ గణాంకాల మీద తీవ్ర ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. పౌష్టికాహారలోపం, చిన్నారులు ఎత్తుకుతగిన బరువు లేకపోవడం, అయిదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహారలోపాలు, వయసుకు తగిన బరువులేకపోవటం, శిశుమరణాల రేటును పరిగణనలోకి తీసుకుని నివేదికను తయారుచేశారు ఐరిష్‌కు చెందిన వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫే సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం భారత్‌ ఆకలి సూచి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జీహెచ్ఐ స్కోరు

జీహెచ్ఐ స్కోరు 2000లో 38.8 శాతం ఉండగా 2012కి 28.8 శాతానికి, 2021కి 27.5 శాతానికి తగ్గింది. అయితే, భారత్‌లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాల రేటు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. సరిపడా ఆహారం కారణంగా పోషకాహార లోపం వంటి ఇతర సూచికలలో భారతదేశం మెరుగుదల చూపించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు