సిఎం కెసిఆర్, కెటిఆర్ ల సహకారంతో ఉమ్మడి జిల్లా నేతలమంతా ఢిల్లీకి వెళతాం
కోచ్ ఫ్యాక్టరీ కోసం...60 ఎకరాలు అడిగితే, 150.05 ఎకరాలు ఇచ్చాం
రైల్వే అధికారులకు భూమి పత్రాలు అందచేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కెటిఆర్ ల సహకారంతో, నాతో సహా, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలమంతా కలిసి ఢిల్లీకి వెళతాం.. ఒత్తిడి తెస్తాం. ఆరు నూరైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, కాజీపేట రైల్వే ఉన్నతాధికారులు తదితరులతో కలిసి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై సమీక్ష జరిపారు. అనంతరం 150.05 ఎకరాల భూమిని రైల్వే అధికారులకు అప్పగించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల కాలం నాటి ఆకాంక్ష రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. పురాతన కాలంనాటి కాజీపేట జంక్షన్ కి అప్పుడెప్పుడో మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ అనుకోని పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి తరలిపోయిందన్నారు. అయితే, కోచ్ ఫ్యాక్టరీకి బదులు రైల్వే వాగన్ ఓవర్ హోలింగ్ వర్క్ షాప్ ప్రాజెక్టు వచ్చిందన్నారు. అయితే, మొదట్లో రైల్వే అధికారులు కోరిన విధంగా 60 ఎకరాల స్థలానికి మించి 150.05 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, వివిధ వర్గాల నుంచి సేకరించి ఈ రోజు రైల్వే అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు.
అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు, వివిధ పార్టీలు దశాబ్దాలుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కో్రారన్నారు. తద్వారా ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలు దక్కుతాయని భావించామన్నారు. ఈ దశలోనూ రైల్వే అధికారులు అడిగిన దానికంటే ఎక్కువ స్థలం కేటాయించినందున తిరిగి కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీనే కేటాయించాలని ఇక్కడి ప్రజల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తెస్తామన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల సహకారంతో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులం, ఎంపీలం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం ప్రజాప్రతినిధులమంతా కలిసి, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. అవసరమైన ఒత్తడి తెచ్చి, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
0 వ్యాఖ్యలు
Please Do not enter any spam link in the comment box