తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి - అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్


తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని,ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో పండే పత్తి స్టేపుల్ (దూది పింజ) పొడవు దేశంలో కెల్లా అత్యంత పొడవుగా వస్తుందని, గట్టితనం కూడా ఎక్కువని సీఎం అన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో వ్యవసాయ విస్తరణపై ముఖ్యమంత్రి సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 

 తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలని సీఎం చెప్పారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తి ఏరిన తర్వాత శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం లాంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు. పత్తిలో ఏమాత్రం చెత్తా చెదారం, మట్టి పెళ్లలు, దుమ్ము చేరకుండా చూడాలని చెప్పారు. 

‘‘దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతున్నది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. తెలంగాణ పత్తి పింజ పొడవు ఎక్కువ కాబట్టి మరింత డిమాండ్ ఉంది. ఇరిగేటెడ్ వాటర్ (సాగునీరు) ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కువ కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

‘‘పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకున్నది. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య కేవలం 60 మాత్రమే ఉంటే, వాటిని 300 కు పెంచేలా చర్యలు తీసుకున్నది. పత్తి పంట ఎక్కువ పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది’’ అని సీఎం చెప్పారు.

‘‘పత్తి సాగులో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే (వన్ టైమ్ పిక్ కాటన్) విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి’’ అని సీఎం కోరారు.

‘‘రైతులు లాభసాటి పంటలనే పండించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చర్యలు ప్రారంభించాం. రైతులు కూడా ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్లో పత్తికి, నూనె గింజలకు, పప్పులకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. వాటిని ఎక్కువగా పండించాలి. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఆయల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి’’ అని సీఎం అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి  ఎస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్  శ్రీనివాసరెడ్డి, కమిషనర్శ్రీ అనిల్, సీఎం ముఖ్య కార్యదర్శి  నర్సింగ్ రావు, కార్యదర్శులు  శేషాద్రి, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు