సుప్రీం కోర్టుకు స్పష్టత నిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆర్ బిఐ
మారటోరియం పొడగింపుపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మారటోరియం పొడగించడం కుదరదంటూ సుప్రీం కోర్టులో శనివారం కేంద్రం, ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేశాయి. కరోనాతో ఆదాయం తగ్గిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని కేంద్రం పేర్కొంది. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, కోర్టుల జోక్యం తగదని కేంద్రం అభిప్రాయపడింది. చక్రవడ్డీ మాఫీ మినహా ఎలాంటి ఉపశమనాలు కల్పించలేమని కేంద్రం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రంగాల వారీగా ఉపశమనం కల్పించడం కుదరదని కేంద్రం, ఆర్బీఐ సుప్రీంకోర్టుకు తెలిపాయి. రుణాల చెల్లింపునకు ఇప్పటికే ఆరు నెలల మారటోరియం ప్రకటించామని చెప్పాయి. మారటోరియం మరింత పొడగించడం కుదరదని సుప్రీం కోర్టుకు సమర్పించిన వేర్వేరు అఫిడవిట్లలో కేంద్రం, ఆర్బీఐ చెప్పారు. మరింత కాలం పొడగిస్తే వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్బీఐ పేర్కొంది.
కోవిడ్-19 కి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని తెలిపింది. ఈ నేపథ్యంలోఈ రంగ కష్టాలను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని తెలిపింది. రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ వివరణ ఇచ్చాయి.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box