రజాకార్ల ఆగడాలతొ రగిలి పోయి - బాంబేసి నిజాంను తునాతునుకలు చేయాలనుకున్న పవార్ - తెలంగాణ భగత్ సింగ్ - ఓ వీరుడా నిను మరవదు ఈ తెలంగాణ


నేడు తెలంగాణ భగత్ సింగ్  నారాయణ రావు పవార్ జయంతి


పుట్టుకొస్తారు...అరాచకం హద్దులు దాటినపుడు... పాలించే అధికారం ప్రజలను పీడించుకు తిన్నపుడు... ప్రజల హాహా కారాల నుండి భగత్ సింగ్ లాంటి వీరులు..ఇది చారిత్రక సత్యం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిజాం నవాబు ప్రాణం తీసి తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా విముక్తి ప్రసాదించాలనుకున్నాడు వరంగల్ బిడ్డ నారాయణ రావు పవార్.
'తుమ్ ముఝే ఖూన్ దేవో మై తుమ్హారే ఆజాది దూంగా' అన్న సుభాష్ చంద్రబోస్ మాటలతో స్పూర్తి పొందిన నారాయన రావు పవార్ తానేమైనా ఫర్వా లేదని  ప్రాణాలకు తెగించి నిజాం నవాబు పై బాంబు విసిరాడు. 


బానిస  దాస్య శృంఖలాలు తెగి పోయిన దినం  1947 ఆగస్ట్ 15 న దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటే దక్కన్ పీఠభూమి లోని నిజాం సంస్థానం లో తెలంగాణ ప్రజలకు మాత్రం కారు చీకట్లు తొలిగి పోలేదు.  నవాబు కిరాయి మూకలైన రజాకార్ల ఆగడాలు మితి మీరి పోయి తెలంగాణ ప్రజలు అరిగోస అనుభవిస్తూనే మరో వైపు పిడికిల్లు బిగించి విముక్తి బాట పట్టిన రోజులు అవి.

ఎక్కడి కక్కడ నిజాం నవాబుకు, రజాకార్లకు, దేశ్ ముఖ్ లకు జాగీర్ దార్లకు  వ్యతిరేకంగా సాంప్రదాయ పనిముట్లు చెప్పులు, చీపుర్లు,బడితెలు, కొడవండ్లు, గొడ్డండ్లను ఆయుధాలుగా చేసుకుని ఆడ మగ తిరగబడి రజాకార్లను తరిమి కొట్టిన సమయంలో ఓ నలుగురు నవయవకులు ఏకంగా నిజాం నవాబునే లేపేసి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని సంకల్పించారు.

పక్కా ప్రణాళికతో జరిగిన బాంబు దాడిలో నిజాం నవాబు వెంట్రుక వాసిలో బతికి పోయాడు. మరో బాంబు విసిరే అవకాశం ఇవ్వక జవాన్లు చుట్టిముట్టి బాంబు విసిరిన యువకున్ని పట్టుకుని కదలకుండా భందించారు. అతనితో పాటు మరో యువకుడు కూడ జవాన్లకు దొరికాడు. బాంబు దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఈ దాడిలో నిజాం కనుక చనిపోయి ఉంటే దక్కన్ పీఠభూమిలో తెలంగాణ గడ్డ చరిత్ర మరో విదంగా లిఖించ బడేది. బాంబు దాడి చేసిన ఆ యువకుడు ఎవరో కాదు. వరంగల్ ముద్దు  బిడ్డ నారాయణ రావు పవార్. నారాయణ రావు పవార్ ధైర్య సాహసాలు చూసి అతన్ని తెలంగాణ భగత్ సింగ్ గా పిలుచు కునేవారు.

 

నారాయణ రావు పవార్  2010 డిసెంబర్ 12 వరకు జీవించాడు. 1925 లో అక్టోబర్ 3 న  పవార్ జన్మించాడు.

 పవార్ తండ్రి పండరినాధ్‌ది కర్ణాటకలోని బీదర్‌జిల్లా బాల్కీ,  తాలూకాదేబ్కీ గ్రామం. వర్షాలు లేక బీదర్ లో తీవ్రమైన కరవు నెలకొనగా పండరి నాధ్ వరంగల్ కు వలస వచ్చి రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజులు గుట్ట కింది వీధిలో నివసిస్తూ రైల్వే స్టేషన్ లో దినసరి కూలీగా పనిచేసాడు.

నారాయణ రావు నాలుగవ ఏట ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి మరో పెండ్లి చేసుకోలేదు.

 నారాయణరావు ఇంటర్ చదువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లి అది పూర్తి అయిన తర్వాత పై చదువులకు డబ్బులు లేక కొంత కాలం రేషనింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశాడు. ఆతర్వాత హైకోర్టులో వకాల్తా కోర్సులో చేరాడు.  

హైకోర్టుకు వెల్తూ వస్తున్న క్రమంలో ఆయనకు పలు మార్లు నిజాం నవాబు కాన్వాయ్ భారి బందో బస్తుమద్య  ప్రధాన రహదారుల గుండా వెళ్ళడం చూశాడు. ఆయన కన్వాయ్ వెళ్ళినపుడల్లా ట్రాఫిక్ నిలిపి వేయడం జరుగుతుండేది.

దాంతో విసుగు చెందిన నారాయణ రావు పవార్ ఓ రోజు  వీన్ని చంపేస్తే పీడ విరగడయ్యేది తెలంగాణకు... అని తన స్నేహితుడుతో అన్నాడు. అప్పటికే రజాకార్ల దురాగాతాలతో తెలంగాణ తల్ల డిల్లి పోతోంది.  గ్రామాలను తగల బెట్టడం సామూహికంగా హత్యలు చేయడం వంటి రజాకార్ల హింసా కాండతో అట్టుడుకుతున్న తెలంగాణాలో మరో వైపు జనం  రజాకార్లపై తిరగబడుతూ తరిమి కొడుతున్నారు.

నిజాం ను లేపేద్దాం అన్న నారాయణ రావు పవార్ నోటి నుండి వచ్చిన మాటకు ఆయన స్నేహితులు అవును వాన్ని లేపాయలని మద్దతు పలికారు. అప్పటికే ఆర్యసమాజ్‌కు చెందిన పండిట్ రుద్రదేవ్పండిట్ నరెంద్రజీల స్ఫూర్తి నారాయణ రావు సంకల్పానికి తోడ్పడింది.  ఆర్య యువక్రాంత్ అనే దళాన్ని ఏర్పాటు చేశాడు. పవార్‌‌తోపాటు పండిట్ విశ్వనాధ్రెడ్డి పోచనాధంజి నారాయణ స్వామిబాలకిషన్గండయ్యా అలియాస్ గంగారాంజగదీశ్ ఆర్య తదితరులు నిజాం ను లేపెయ్యాలన్నధృడ సంకల్పంతో పథకాన్ని రూపొందించారు.

దాడికి అవసరమయ్యే బాంబులు సమకూర్చుకునేందుకు బాంబులు సమకూర్చుకునేందుక బొంబాయి వెళుతూ మార్గ మద్యంలో షోలాపూర్ లో కొండ లక్ష్మణ్ బాబు ఉన్నాడని అతనిసహాయం కోరుతూ అతన్ని కలిసారు. అయితే నిజాం ను లేపేస్తా మని చెబితే కొండా లక్ష్మణ్ బాపూజి ఎట్లా స్పందిస్తారో తెలియక తెలంగాణ లో రజాకార్ల ఆగడాలు బాగా మితి మీరి పోయాయని వారు సాగించే హింసా కాండకు చరమ గీతం పాడాలని బాంబుల కోసం బొంబాయి వెళుతున్నామని చెప్పాడు. అయితే కొండా లక్మణ్ బాపు వారు చెప్పిన మాటలు పూర్తి కాకుండానే రజాకార్లేమిటి ఏకంగా నిజాం నే లేపేస్తే సరి అనడంతో ఆశ్యర్య పోతారు.

 

కొండా లక్మణ్ బాఫూజి వీరికి సూచనలు సలహాలు ఇవ్వడమే కాక బాంబులు కొనేందుకు వారికి 600 రూపాయలు కూడ ఇస్తాడు. వాటితో వారు బౌంబాయికి వెళ్లి అక్కడ  బాంబుల వ్యాపారం చేసే ఓ గుజరాతి బ్రాహ్మణుడి నుండి రూ 12 కు ఒకటి చొప్పున శక్తివంతమైన రెండు పిన్ బాంబులు కొనుగోలు చేస్తారు.

అతర్వాత వాటిని తీసుకుని తిరుగు ప్రయామంలో షోలాపూర్ కు వెళ్ళి బాపూజీని కలుస్తారు. అక్కడే నిజాం నవాబు పై దాడికి పథక రచన చేస్తారు. కొండా లక్ష్మణ్ బాపు సహకారంతో  మూడు పిస్టళ్లు సమకూర్చుకుంటారు. ఒక వేళ దాడి పథకం విఫలం అయితే నిజాం జవాన్లకు దొరకకుండా విషం సేవించి తాగాలని విషం బాటిళ్ళు కూడ సమకూర్చుకుంటారు.

మరణ వాగ్మూలం వంటి ప్రతిజ్ఞను తమ రక్తంతో ఓ కాయితంపై రాసుకుని ముగ్గురూ కల్సి ఫోటో దిగుతారు. దాడి అనంతరం ఆ ఫోటోను వారి ప్రతిజ్ఞ లేఖను నారాయణ స్వామి విజయ వాడకు తీసుకు వెళ్ళి పత్రికలకు ఇవ్వాలి.

వారి దాడి పథకం ఏంటంటే నిజాం రాజు కారుకు ఎదురుగా వెళ్ళి బాంబు విసరాలి. ఒక దగ్గర బాంబు దాడి విఫలం అయితే రెండో చోట బాంబు దాడి జరగాలి. అనంతరం ఆ వెంటనే కాల్పులు జరపాలనేది వారి ప్లాన్.

జగదీశ్ ఆర్యమధ్యన నారాయణ రావు పవార్ తర్వాత కొద్దిదూరం‌లో గండయ్య బాంబుపిస్తోలువిషం సీసాలతొ నిల్చున్నారు. పవార్ బాంబు తప్పి ముందుకువెళితే గండయ్యవెనక్కి వెళితే జగదీశ్ ఆర్య దాడిచేయాలి.

 

 


 

డిసెంబర్ 4 శుక్రవారం 1947 సాయంత్రం 4-5 గం.ల మధ్య  నిజాం నవాబు తన  నివాసమైన కింగ్ కోఠీ పాలెస్ నుండి దార్ ఉల్ షిఫాలోని తల్లి సమాధి వద్దకు బయలు దేరుతాడు.

ఒక సందు గుండా హఠాత్తుగా నిజాం నవాబు కారుకు ఎదురుగా వచ్చిన నారాయణ పవార్ బాంబు విసురుతాడు. అది గురి తప్పి నేరుగా కారు ముందు భాగాన పడి పేలుతుంది. బాంబు దాటికి పెద్ద గొయ్యు ఏర్పడుతుంది. బాంబు గురి తప్పడంతో నిజాం నవాబు ప్రాణాలతో బయట పడతాడు. కాని ఈ దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. మరో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడతారు. దాడి అనంతరం బాంబు శబ్దం విన్న రెండో చోట మాటు వేసిన వారు దాడి సక్సెస్ అయిందని అక్కడి నుండి వెళ్లి పోతారు. నారాయణ రావు పవార్ గురి మిస్ అయిందని చేబు నుండి పిస్టల్ తీసి కాల్పులు జరిపేందుకు సిద్ద పడుతుండగా నవాబు జవాన్లు పరుగున వచ్చి పట్టుకుని చితక బాదుతారు. నారాయణ రావు పవార్ దవడ పండ్లు ఊడి పోయేలా కొడతారు. అయితే ఈ గందరగోళంలో కొంత దూరం వెళ్ళి ఆగిన నిజాం నవాబు తిరిగి వెనక్కి వచ్చి వారిని హింసించ వద్దని చట్ట రీత్యా శిక్షించాలని ఆదేశిస్తాడు. దాడి ఎందుకు చేశారో ఎవరు చేయించారో చెప్పాలంటూ  పవార్ ను, గండయ్యను ఆ తర్వాత కూడ తీవ్ర చిత్ర హింసల పాలు చేస్తారు. వారి చేతిలో నారాయణ రావు పవార్ ఎలాంటి దెబ్బలు తిన్నాడో వివరిస్తు ఆ దెబ్బలు తనకు జీవితాంతం భాదిస్తున్నాయని ఆయన్ని కల్సిన వారితో చెబుతుండే వాడు.

కోర్టు నారాయణ రావు పవార్ కు, గండయ్యకు మరణ శిక్ష విధిస్తుంది. అయితే నిజాం నవాబుకు అప్పటికే తెలంగాణ లో జరిగిన పరిణామాలతో తన సంస్థానం మన గలగడం అనుమానమేనని  తెలంగాణ ప్రజల తిరుగు బాట్లు మరో వైపు ఇండియన్ యూనియన్ సైనిక చర్య తదితర వత్తిళ్ల తో శిక్షలు అమలు చేయలేదని చెబుతారు. కోర్టు విధించిన మరణ శిక్ష తీర్పు పై అసలు నిజాం నవాబు సంతకం చేయలేదని ఆయన అప్పటి వరకు ఏ ఒక్క మరణ శిక్ష తీర్పుపై కూడ సంతకం చేసి ఉండక  పోవడం కూడ ఓకారణమని చెబుతారు. దాంతో మరణ శిక్ష పడిన వారంతా అప్పటి వరకు జీవిత శిక్ష పడిన ఖైదీలుగా శిక్ష అనుభవించారని చెబుతారు.

నారాయణ రావు పవార్ పోలీస్ యాక్షన్ అనంతరం 1949లో జైలునుండి విడుదలయ్యాడు.

పవార్ తన దాడి ఘటన పై ఆయనను కల్సిన సన్నిహితులతో ఎంతో భావోద్వేగంతో వివరించే వాడు. నేను కోర్టులో లాయర్ ను కూడ పెట్టు కోలేదు. నేనే నా కేసు వాదించుకున్నాను... నిజాం ను చంపమని ఎవరూ నన్ను ప్రోద్బలించ లేదు. రజాకార్లు సాగించిన  హత్యాకాండ చూసి తెలంగాణ ప్రజల విముక్తి కోసమే నిజాం నవాబును ను చంపాలనుకున్నానని కోర్టులో వాదించానని నారాయణ రావు పవార్ వివరించే వాడు.


'సర్ ఖటా సక్తే హై లేకిన్ సర్ ఝుకా సక్తే నహి 'అనే పండిత్ రాంప్రాసద్ బిస్మాల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకుని కోర్టు నాకు మరణ శిక్ష విధించిన రోజు విజయ గర్వంతో గట్టిగా అరిచానని నారాయణ పవార్  పరవస్తు లోకేశ్వర్ అనే జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.


తెలంగాణ విముక్తి కోసం నిజాం నవాబుకు రాజాకార్లకు  వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన పోరాట యోధుల్లో నారాయణ పవార్ పేరు చిర స్థాయిగా నిలిచి పోయింది.


(ఇందులో రావి చెట్టు రాజేశ్వర్ రావు 2017 లో  రాసిన ఆయన  ముఖపుస్తకం(Facebook wall) నుండి నారాయణ రావుకు సంభందించిన వివరాలు సేకరించడం జరిగింది. 

 

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు