వడ్డీకి వడ్డి చెల్లించాల్సిన అవసరం లేదు- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.

 మారటోరియం కాలానికి
వడ్డీకి వడ్డి చెల్లించాల్సిన అవసరం లేదు- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.



లాక్డౌన్ ( Lockdown ) సమయంలో లోన్ మారటోరియం ( Loan moratorium ) తీసుకున్నవారికి సుప్రీంకోర్టు ( Supreme court ) శుభవార్త అందించింది. నవంబర్ 15 వరకూ వడ్డీపై వడ్డీని ( Interest on interest ) చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వెంటనే అమలు చేయాలని..నెల సమయం ఎందుకని ప్రశ్నించింది.

కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) లోన్ మారటోరియం విధించింది.

రుణాల వాయిదాలపై తాత్కాలికంగా బ్రేక్ విధించింది. అయితే ఈ వెసులుబాటు ఉపయోగించుకున్నవారి రుణాల ఈఎమ్ఈలపై వడ్డీకు వడ్డీ చెల్లించాల్సిరావడంతో..సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

విచారణ జరిపిన సుప్రీంకోర్టు లోన్ మొరటోరియం వెసులుబాటు వినియోగించుకున్నవారికి ఉపశమనం కల్పించింది. తాత్కాలిక నిషేధాన్ని వినియోగించుకునే ప్రజలు 2020 నవంబర్ 15 వరకు వడ్డీపై వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. నవంబర్ 15 వరకు ఎటువంటి రుణ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ( NPA ) ప్రకటించలేమని చెప్పింది. విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ), బ్యాంకుల తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసు విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించగా.. నవంబర్ 2 వరకు వాయిదా పడింది.

వడ్డీ మినహాయింపు పథకాన్ని( Interest waiving scheme ) కేంద్ర ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిని అమలు చేయడానికి కేంద్రానికి ఒక నెల సమయం ఎందుకని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, తాము వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వడ్డీపై వడ్డీ మినహాయింపు పథకంపై నవంబర్ 2 లోగా సర్క్యులర్ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా..నవంబర్ 2 వరకు వడ్డీపై వడ్డీ మినహాయింపు పథకంపై ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేస్తుందని సొలిసిటర్ జనరల్ చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు