ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీం పాత్ర దారి ఎన్టీఆర్ నెత్తిన టోపి సీన్ తొలగించకుంటే సినిమా ధియేటర్లు కాలబెడతామని బీజేపీ ఎంపీ సోయం బాపురావు బాహుబలి ఫేం దర్శకుడు రాజమౌళిని హెచ్చరించారు. శనివారం కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన కొమురం భీమ్ 80వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా బాపురావు మాట్లాడుతూ ఆదివాసి గిరిజనల హక్కుల కోసం నిజాం సర్కారుకు వ్యతిరేకంగా జల్ జంగల్ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కొమురం భీం పాత్రను సినిమా కోసం వక్రీకరిస్తే ఊరుకునేది లేదన్నారు. భీం వేశధారణలో కనిపించే ఎన్టీఆర్ నెత్తిన టోపి ధరింపచేయడం అంటే ఆదివాసి గిరిజనులను అవమానించడమే నని అన్నారు. ప్రభుత్వం అదివాసీల సమస్యలు పరిష్కరించాలన్నారు. లంబాడాలను గిరిజనుల జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేసారు. గిరిజనులుసాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు పట్టాలివ్వాలని అన్నారు.
జోడేఘాట్ లో జరిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి మహారాష్ట్ర , ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల ఆదివాసీలు భారి సంఖ్యలో హాజరయ్యారు. కరోనా కారణంగా అధికారులతో నిర్వహించే దర్బార్ రద్దు చేసారు. దాంతో గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సాంప్రదాయ రీతిలో గిరిజనులు కొమురం భీం కు పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.
జడ్పీ చైర్మన్ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కొనప్ప, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కోమురం భీమ్ మనవడు సోనే రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box