శిరోముండనం కేసు: స్పందించిన రాష్ట్రపతి

 ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. దీంతో ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు. 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్‌ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్‌ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు