కరోనా అనుభవాలతో వైద్యసదుపాయాలపై దృష్టి పెట్టాలి...ప్రధానికి సిఎం కెసిఆర్ సూచన


కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంకేసీఆర్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు.
"కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి, కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఎ లాటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీని కోసం ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేసి దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి సూచించారు.
"తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాల రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావాల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామాగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నది" అని ముఖ్యమంత్రి వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి  రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాస రావు,  రమేష్ రెడ్డి,  గంగాధర్, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొనారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు మాట్లాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు