టీటీడీ ఆస్తుల పై శ్వేతపత్రం ప్రకటిస్తాం - టిటిడి ఇవో అనిల్ కుమార్ సింఘాల్



తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వివాదాలకు తావులేకుండా పూర్తి స్థాయి పరిశీలన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆదివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తున్నామని, అప్పటి పరిస్థితుల మేరకు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సెప్టెంబర్‌ నెల వరకు టీటీడీకి ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవని వెల్లడించారు.
ఇప్పటి వరకు 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని ఈవో సింఘాల్ వెల్లడించారు. మరోవైపు 91 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకినట్లు ప్రకటించారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికీ కరోనా సోకలేదన్నారు. అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది టీటీడీ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించామన్నారు.

631 మంది యాత్రికులకు కరోనా పరీక్షలు చేశామని ఈవో సింఘాల్ తెలిపారు. జూన్‌ 11 నుంచి జులై 10వ తేదీ వరకు హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. ఇప్పటి వరకు 13.36 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపారు. 1.64 లక్షల మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా, 85,434 మంది కౌంటర్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొని దర్శనం చేసుకున్నారని, టికెట్లు బుక్‌ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్రను రద్దు చేసుకున్నారని సింఘాల్‌ వివరించారు. కాగా, టీటీడీ ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంతో కాలంగా పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సైతం దీనిపై డిమాండ్ చేశారు. ఈ తరుణంలో శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించడం గమనార్హం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు