జర్నలిస్టులందరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి -మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

జర్నలిస్టులందరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కోరారు.  

బిఆర్కే భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్ ను సోమవారం  మీడియా అకాడమి చైర్మన్ అల్లంనారాయణ సహా తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ నాయకులుకల్సి జర్నలిస్తులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుందని, వీరందరికి విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. TV-5 విలేకరి మనోజ్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి ఆకస్మికంగా మృతి చెందారని మంత్రికి వివరించారు. ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, సానిటైజర్, పి.పి.ఇ. కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలన్నారు. జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులను అన్ని ఆరోగ్య సమస్యలకు కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్యం అందే విధంగా, టెస్ట్ లకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు 20 లక్షల ప్రమాద భీమా వర్తింప జేయాలని అన్నారు.  అత్యవసర సర్వీసులైన వైద్యం, పారిశుద్ద్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా ప్రతి క్షణం కరోనా వార్తలపై ప్రజలకు ప్రామాణిక సమాచారంతో పాటు పత్రికలు, చానళ్లలలో పని చేసే జర్నలిస్టులు ఒక గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందుకు మంత్రి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో ముందస్తు జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, జర్నలిస్టుల సంఘాల నాయకులు నవీన్ కుమార్, సాధిక్, పార్థసారధి, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు