పేపర్ టైగర్స్ -ఎవరి పైత్యం వారిదే..

-కాగితపు పులుల అభయారణ్యమిది..
-సమైక్య సీమాంధ్ర సామూహిక పైత్యమిది
-చారిత్రక పరిణామం వదిలి చవకబారు శీర్షికలు..
– అక్షరాలతో కక్ష తీర్చుకున్న పెత్తందారీ కలాలు
-బిల్లుపై చర్చ ముగిసిన సంగతిని పక్కనపడేసి..
-తిరస్కారమంటూ దుష్ప్రచారం
రేపు పార్లమెంటు తెలంగాణ బిల్లును ఆమోదించాక సీమాంధ్ర పత్రికలు ఏం శీర్షిక పెడతాయి? కచ్చితంగా తెలంగాణ గెలిచిందని మాత్రం కాదు. హైదరాబాద్ ఇరుక్కు పోయిందనో.. లేక తెలుగు విషాదమనో.. విచ్ఛిన్నమనో! ముక్కలు.. బద్దలు అనో! ఆ వార్తకు అటో ఇటో సీమాంధ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడవచ్చు! లేక ఏ నాయకురాలో కడివెడు కన్నీరొలికించవచ్చు. ఏ వద్ధుడి శూన్యదక్కుల ఛాయాచిత్రమో దర్శనమీయవచ్చు! రాజధానిలో సీమాంధ్రుల ఆందోళన, ఆవేదన, భయాందోళన ఉండవచ్చు. రియల్‌ఎస్టేట్, ఐటీ ఢామ్మని పడిపోనూ వచ్చు. ఇంతకుమించి భిన్నంగా సీమాంధ్ర పత్రికల వార్తలు ఉండవు. సహజం. కాకినుంచి కోకిల గీతాలను ఆశించడం అత్యాశ! తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసిన మరుసటి రోజు సీమాంధ్ర రాజకీయ నాయకుల ప్రయోజనాలు కాపాడేవిగా ఖ్యాతికెక్కిన కొన్ని పత్రికలు పెట్టిన శీర్షికలు.. చానళ్లలో మార్మోగిన చర్చోపచర్చలే సాక్ష్యం!
(సవాల్‌రెడ్డి):పత్రికలు వేరు వేరు కావచ్చు గానీ మన సీమాంధ్ర మీడియా దారి ఒకటే. తెలంగాణ వ్యతిరేకత విషయంలో అంతా పులిబిడ్డలే. తెలంగాణ ఆకాంక్షను చిదిమేయాలనుకునే కర్కశత్వం. తమ రాతలతో తెలంగాణను ఆపేస్తామనుకునే మూర్ఖత్వం. ఈ విషయంలో ఏక్‌సే బడ్‌కర్ ఏక్. ఈ ధోరణి గురువారం శాసనసభలో తెలంగాణ బిల్లు చర్చ ముగింపు అంశంపై సీమాంధ్ర పత్రికలన్నీ పెట్టిన శీర్షిక ద్వారా మరోసారి బట్టబయలైంది. అన్ని సీమాంధ్ర పత్రికలు పెట్టిన హెడ్డింగ్ ఒకటే. సారాంశం ఒక్కటే. అంతా ఒక్కచోట కూర్చుని పేపర్లు తయారు చేసుకున్నారా? అన్నట్టు. కోరస్ గీతం తిరస్కారం. ఇంతకీ సభ తిరస్కరించింది దేనిని? రాష్ట్రపతి పంపిన బిల్లునా? లేక సీఎం తీర్మానంలో పేర్కొన్న బిల్లునా? అనే విచక్షణ పాటింపు అనే విధానం మన మీడియాకు అసల్లేదు. మా పైత్యం మాది.. మీ ఖర్మ మీది అనే పద్ధతి.
అక్కడికి తమ శీర్షికలు, వక్రీకరణలతో తెలంగాణ బిల్లు ఏదో ఆగిపోయినంత బిల్డప్. తెలంగాణ ప్రజలను కంగారుపెట్టి గంతులేసే రాక్షసానందం. పత్రికల్లో పతాక శీర్షిక కావల్సింది.. చిత్తు కాగితాల లెక్కలు కాదు. దశ దిశ మార్చే పరిణామాలు. నిన్నటి సభలో రాష్ర్టానికి సంబంధించి ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన అనే ఓ మహా పరిణామానికి సంబంధించి ఓ మైలురాయి దాటి వెళ్లింది. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లు చర్చ పూర్తి చేసుకుని అసెంబ్లీకి వీడ్కోలు చెప్పి హస్తినకు పయనం కట్టింది. ఇక ఇదే సభలో నాలుక గీసుకోడానికి కూడా పనికిరాని ఓ తీర్మానం చట్టబద్ధత ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఆమోదం పొందింది. ఈ తీర్మానంతో భూమ్యాకాశాలు బద్దలవవు. సముద్రాలు ఉప్పొంగవు. మహా అయితే.. సభ వ్యతిరేకించింది అనే ఒక ఓదార్పు వాక్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర చివరి పుటల్లో చోటు చేసుకుంటుంది. అంతకు మించి దాని ప్రభావం శూన్యం. ఈ స్థితిలో ఏది పతాక శీర్షిక కావాలి? రాష్ట్ర చరిత్రకు భరతవాక్యం పలికే పరిణామమా? ఓ ఓదార్పు సంఘటనా? పనికిరాని తీర్మానం పతాక శీర్షిక కావడం ఏ పతనావస్థకు సంకేతం? వెనకటికి మూర్ఖంగా వ్యవహరించేవారిని పెద్దలు అడిగేవారు.. ఎవర్రా నీకు చదువు చెప్పింది? అని.
సీమాంధ్ర మీడియా పైత్య ప్రకోపాలు ఇక్కడికే పరిమితం కాలేదు. రంగు డబ్బాలకు ఈ మాత్రం దశ్యాలు సంతప్తి కలిగించవు. వెతికి వెతికి రంకెలు వేసే కాగితపు పులులను పట్టుకుని గొట్టాలకు పని కల్పించారు. వికటాట్టహాసాలు.. బసవన్నల గెంతులు.. ప్రసారం చేసి కడుపారా ఆనందించేశారు. ఈ కాగితం పులుల అభయారణ్యంలో సీమాంధ్ర సింహాలు గర్జించాయి. గాండ్రించాయి. ఘీంకరించాయి. ఓండ్రపెట్టాయి. మొత్తానికి సీమాంధ్ర నాయకులు అదష్టవంతులు. ఎంత కష్టపడ్డా నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోవడమే ఎమ్మెల్యేలకు చాలాచాలా కష్టం. కానీ సీమాంధ్ర మీడియా పుణ్యం.. రేపు పది ఓట్లు కూడా ఖాయంగా వస్తాయని గ్యారెంటీ లేని నాయకులు కూడా మీడియాలో హీరోలు. సొంత జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను కూడ గట్టుకునే సామర్థ్యం లేకున్నా.. తెలంగాణకు అడ్డుపడితే చాలు.. సింహాలే. ఇంతకు ముందు 14 ఎఫ్ రద్దు రాష్ట్రపతితో కూడా కాదని వాదించిన పులులున్నాయి. కాంగ్రెస్ తెలంగాణను ఆమోదించదని చెప్పిన చిరుతలు ఉన్నాయి.
కేబినెట్ ఆమోదించదని, బిల్లు రాదని, ఆగి పోయిందని ఇలా ఎన్నో చెప్పిన రకరకాల జీవరాసులున్నాయి. అయినా వాళ్లే మీడియా హీరోలు. అడ్డంగా వాదించడం వస్తే మేధావులు. విశ్లేషకులు. అసెంబ్లీ తిరస్కరించింది కాబట్టి రాష్ట్రపతి ఆలోచించాలట! అసలు తీర్మానం మంత్రుల అంగీకారమే లేనపుడు అధికారికమవుతుందా? అనే వివేచన అక్కర్లేదు. అసెంబ్లీలో తెలంగాణ, ఆంధ్ర సభ్యుల సంఖ్య ఎం త?అనే లెక్కలు అవసరం లేదు.
అసలు జరుగుతున్నదేమిటి?
సరే.. మీడియా అనందం మీడియాది. కురుక్షేత్రం ముగిసి దుర్యోధనుడి తొడలు విరిగి చావుబతుకుల్లో ఉన్నప్పుడు అశ్వథ్థామ అనే అల్పుడు ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసానందం పొందాడు. ఇవాళ సీమాంధ్ర నాయకులు, మీడియాది అదే తరహా ఆనందం. అయితే ఆ చర్య తదుపరి పరిణామాలను నిరోధించలేదు. కేంద్ర స్థాయిలో తదనంతర పరిణామాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశం ఖాయమై పోయింది. హోంశాఖలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జీవోఎం సభ్యుల తతంగం ముందుగా చేపడుతున్నారు.
తెలంగాణ, ఆంధ్ర మధ్య విభేదాల అంశం 2009 డిసెంబర్ 9 నాడే దేశమంతా తెలిసిపోయింది కాబట్టి ఇవాళ అసెంబ్లీలో తీర్మానాన్ని చూసి జాతీయ పార్టీలేవీ ఏ రకమైన విస్మయాలకు, విభ్రాంతికి గురై.. నైతికత అంశం మీద కిందమీద పడే అవకాశం లేదు. పాతతరం నేతలకు రాష్ట్ర విభజన అంశం ఎలాంటి భావోద్వేగాలు సష్టిస్తుందో పంజాబ్, బొంబాయి అనుభవాలు… కొత్త తరం నేతలకు జార్ఖండ్ ఏర్పాటు వివాదాల చూసిన అనుభవం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఎవరెందుకు వ్యతిరేకత వ్యక్త పరుస్తున్నారో అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇక ఈయొక్క తీర్మానం పట్టుకుని న్యాయస్థానాల మెట్లెక్కాలనే ఆశలు కొందరికి ఉంటే ఉండవచ్చు. ఉరి శిక్ష పడిన వారికి క్షమాభిక్ష మీద ఆశలుండడం సహజం. అయితే రాజ్యాంగం అధికారాలు పార్లమెంటుకు ఇచ్చి ఉండడం, కోర్టులు సైతం ఈ విషయంలో అలాంటి తీర్పులు వెలువరించి ఉండడం వల్ల ఆ సమస్య ఉండే అవకాశం లేదు. కాకపోతే సీమాంధ్రులకు న్యాయవాదుల ఫీజుల రూపంలో ఓ పది, ఇరవై కోట్లు వదలవచ్చు. మీడియా కొంతకాలం స్క్రోలింగ్‌ల పండగ చేసుకోవచ్చు.
గత అనుభవాలు…
సీమాంధ్ర మీడియా ఇష్టారాజ్యపు వక్రీకరణలు, ప్రగతి భావన వ్యతిరేకత ఇప్పటివి కావు. ఇవాళ గిడుగు పేరు వ్యవహారిక భాష గురించి చెప్పేటప్పుడు ఘనంగా చెబుతారు కానీ ఆయన వ్యవహారిక భాష ఉద్యమం చేపట్టి బతిమాలి బ్రిటిష్ అధికారులను ఒప్పించి ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లో వ్యవహారిక భాష వాడకానికి 1920 ప్రాంతంలో ఓ ఆర్డర్ సాధించారు. దానికి వ్యతిరేకంగా గ్రాంధిక భాషా ఉద్యమాన్ని భుజాన మోసి, ఊరూరా తీర్మానా లు చేయించి ఆర్డర్‌ను ఈ సీ మాం ధ్ర మీడియానే రద్దు చేయించింది. ఆ తర్వాత కాలంలో రూటు మార్చుకోవడం వేరే విషయం. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ మధ్య సం బంధం, హైదరాబాద్ అసెంబ్లీలో 1953లో విశాలాంధ్రకు వ్యతిరేక తీర్మానం చేసిన సంగతి, తిరిగి 19 55 లో ఆంధ్రప్రదేశ్ తీర్మానం వెనుక అసలు వాస్తవం, ఎన్టీరామారావు జై ఆంధ్ర ఉద్యమానికి జైకొట్టిన ఉదం తం, 1955లో ఆంధ్ర రాష్ట్రం కర్ణాటకలో విలీనానికి కర్నూలులో చర్చలు జరిపారన్న వాస్తవం, నిజాం పాలనలో ప్రజోపయోగ కార్యక్రమాలు కూడా అమలు చేశారన్న విషయం .. ఇలా అనేక విషయాల్లో సీమాంధ్రకు అనుకూలంగా మీడియా ఇష్టారాజ్యంగా వక్రీకరణలు చేసింది.
తెలంగాణ ఉద్యమం జరిగినపుడు వేర్పాటువాదమని ఈసడించి, వ్యతిరేక ప్రచారం చేసి, జై ఆంధ్ర ఉద్యమాన్ని మాత్రం భుజానేసుకుని మోసింది. మలిదశ తెలంగాణ ఉద్యమం నాటికి పూర్తిస్థాయిలో స్థిరపడ్డ సీమాంధ్ర మీడియా బహుశా ప్రపంచంలో మరే ఇతర ఉద్యమం మీద ఎక్కడా జరగనంత పైశాచిక దాడికి పాల్పడింది. పరిశ్రమలు పోతాయంది. రియల్ పడిపోతున్నదంది.సమైక్యఉద్యమానికి సర్వం తానై నడిపింది. అప్పుడూ ఇప్పుడూ సీమాంధ్రకు సీమాంధ్ర ప్రయోజనాలే ముఖ్యం లక్ష్యం.. ఆదినుంచి తెలంగాణ అంటే సీమాంధ్రలకు తమ ఆధిపత్య ప్రదర్శనా క్షేత్రం. అరవై ఏళ్లుగా జీర్ణించుకుని వారసత్వంగా అందించడం వల్లనే తెలంగాణకు అంతకన్నా ఎక్కువ స్థాయిని ఇవ్వలేక గింజుకోవడం. ఇవాల్టి ధోరణికి అదే పునాది.

February 1, 2014

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు