పెళ్లిళ్లకు 50 మందికి అనుమతి.. ఏపీలో లాక్ డౌన్ సడలింపులు

లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించిన వైసీపీ సర్కారు.. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించాలనుకునే వారు కార్లలో అయితే గరిష్టంగా ముగ్గురికి మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. దుకాణాల వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతివ్వాలని, అక్కడ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతివ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. రెస్టారెంట్లు వద్ద పార్శిళ్లకు అనుమతిస్తూనే అక్కడ కూడా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలని, రాత్రి 7 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు.

కోవిడ్‌-19 లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా వారికి అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే పేదలకు ఇచ్చేందుకు గాను ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని సీఎస్‌ నీలం సాహ్నిని సీఎం సూచించారు. దీంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకునే వీలు కలగనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు